న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తూ జైలులో మరణించిన కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ ఇంటికి ముగ్గురు బీజేపీ ఎంపీలు వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు సజ్జన్ కుమార్ మరణం పట్ల సంతాపం తెలిపారు. (BJP MPs Visit Sajjan Kumar’s House) బీజేపీ జాతీయ అధ్యక్షుడు దీనిపై స్పందించారు. పార్టీ ఎంపీలకు సమన్లు జారీ చేశారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న 80 ఏళ్ల సజ్జన్ కుమార్ పలు అనారోగ్య సమస్యల కారణంగా ఆగస్ట్ 20న జైలులో మరణించారు.
కాగా, సజ్జన్ కుమార్ అంత్యక్రియల తర్వాత నిర్వహించిన భోగ్ (పెద్దకర్మ) కార్యక్రమానికి ముగ్గురు బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ కమల్జీత్ సెహ్రావత్, దక్షిణ ఢిల్లీ ఎంపీ రణబీర్ సింగ్ బిధురి, వాయువ్య ఢిల్లీ ఎంపీ యోగేందర్ చందోలియా ఆయన ఇంటికి వెళ్లారు. సజ్జన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేశారు. సిక్కు మతపరమైన ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు.
మరోవైపు ఢిల్లీకి చెందిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ దీనిపై విమర్శలు గుప్పించారు. అల్లర్ల కేసులో దోషిగా తేలిన వ్యక్తి పట్ల ఆ ముగ్గురు బీజేపీ ఎంపీల హృదయాలు ద్రవిస్తున్నాయని ఎక్స్ పోస్ట్లో ఎద్దేవా చేశారు.
అయితే ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ స్పందించారు. ముగ్గురు బీజేపీ ఎంపీలైన రామ్వీర్ బిధురి, యోగేందర్ చందోలియా, కమల్జీత్ సెహ్రావత్లకు సమన్లు జారీ చేశారు. వారు అక్కడికి వెళ్లకూడదని ఆయన అన్నారు.