పాట్నా: బీహార్లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేగింది. తాజాగా 20 మందిని బలితీసుకొన్నది. తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి కల్తీ మద్యం తాగి 20 మంది మరణించగా, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కల్తీ మద్యాన్ని ఓ ట్యాంకులో తీసుకొచ్చి స్థానిక వ్యాపారులకు విక్రయించారని, ఆ తర్వాత మరణాలు చోటుచేసుకొన్నాయని స్థానికులు చెప్తున్నారు.
దీనిపై బీహార్ సీఎం నితీశ్కుమార్ మాట్లాడుతూ ఈ ఘటన చాలా విచారకరమని అన్నారు. స్థానిక అధికారుల నుంచి సమాచారం కోరానన్నారు. ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నితీశ్ ప్రభుత్వం 2016లో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా బ్లాక్ మార్కెట్లో అక్రమంగా మద్యం దందా కొనసాగుతూనే ఉన్నది. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.