Landmine Blast @ LOC | జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో మందుపాతర పేలడంతో ఇద్దరు సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నియంత్రణ రేఖ (ఎల్వోసీ)కి అత్యంత సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. నౌషెరా-సుందర్బనీ సెక్టార్ పరిధిలో ఈ పేలుడు సంభవించిందని అధికార వర్గాలు తెలిపాయి.
పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సైనికాధికారి, ఓ జవాన్ మందుపాతరపై కాలు పెట్టగానే పేలిపోయిందని అధికార వర్గాల కథనం. ఇక గాయపడిన వారిని చికిత్స కోసం ఆర్మీ దవాఖానకు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నౌషెరా సెక్టర్. జమ్ములోని పిర్పంజాల్ రీజియన్ రాజౌరీ జిల్లాలోకి వస్తుంది. మూడు వారాలుగా ఈ ప్రాంతంలో సైన్యం ఆపరేషన్స్ సాగుతున్నాయి.