ముంబై: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో 55 మంది గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. సమీపంలోని ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మాంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్హాని ఘాట్ ప్రాంతంలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా 55 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
కాగా, మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 300 అడుగుల లోయలో పడిపోయింది. ఐదుగురు మైనర్లతో సహా 13 మంది మరణించారు. 29 మందికి పైగా గాయపడ్డారు. అయితే కొండలు, ఘాట్ మార్గం కావడం, రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.