పట్నా: బీహార్లో గత కొన్నేండ్లుగా మద్య నిషేధం అమల్లో ఉన్నది. దాంతో అక్కడ గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మద్యం, నాటుసారా దందా కొనసాగుతున్నది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను ఎక్సైజ్ డిపార్టుమెంట్కు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాజధాని పట్నాలోని పాలిగంజ్ పట్టణ ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో వారిని లాకప్లో పెట్టారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత కథ మలుపు తిరిగింది. అదేరోజు రాత్రి పోలీస్స్టేషన్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఐదుగురు ఖైదీలతో కలిసి సీజ్ చేసిన మద్యంతో పార్టీ చేసుకున్నారు. అంతటితో ఆగక వారిలోని ఓ వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీసి తన కుటుంబసభ్యులకు పంపించాడు. దాంతో ఆ వీడియోలో వైరల్గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
ఆ వీడియోలో.. ఐదుగురు ఖైదీలు లాకప్లోనే మద్యం సేవిస్తున్నారు. బయటి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు వారికి సహకరిస్తూనే కంపెనీ ఇచ్చారు. ఈ దృశ్యాలను చూసి ఆగ్రహించిన ఉన్నతాధికారులు.. వెంటనే చర్యలకు పూనుకున్నారు. ఐదుగురు ఖైదీలతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.