న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో ఈసారి రైల్వేలకు పెద్దపీట వేశారు. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపుల కంటే 9 రెట్లు అధికమని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రంగాల్లో తొలి మైలు నుంచి చివరి మైలు వరకు అనుసంధాన తను పెంచేందుకు కీలకమైన 100 ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయ నున్నట్టు ప్రకటించారు. ప్రైవేటు మార్గాల ద్వారా సేకరించే రూ.15 వేల కోట్లు సహా మొత్తంగా రూ.75 వేల కోట్లతో ప్రాధాన్య ప్రాతిపదికపై ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సవరించిన అంచనాల ప్రకా రం రైల్వేల నికర వ్యయం రూ.2,42,892 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్న కేంద్రం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2.65 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రయాణి కుల సౌకర్యార్థం రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్సఫర్, తేజస్ లాంటి ప్రీమియర్ రైళ్లలో వెయ్యికిపైగా కోచ్లను ఆధునిక హంగులు, అందమైన ఇంటీరియర్లతో మెరుగుపర్చడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు కొత్త లైన్లు వేయాలని, మరిన్ని మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తున్నది. హైడ్రోజన్ ఆధారిత ఇంధనంతో నడిచే 35 రైళ్లను, సైడ్ ఎంట్రీతో కూడిన నూతన డిజైన్తో 4,500 ఆటోమొబైల్ క్యారియర్ కోచ్లను, 5 వేల ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్) కోచ్లను, 58 వేల వ్యాగన్లను తయారు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది.