చెన్నై: శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అక్కడ బతకడం కష్టంగా భావిస్తున్న శ్రీలంక వాసులు పడవల్లో భారత్ చేరి ఆశ్రయం కోరుతున్నారు. తాజాగా జాఫ్నా, మన్నార్కు చెందిన 19 మంది శ్రీలంక వాసులు తమిళనాడులోని ధనుష్కోడికి ఆదివారం పలు పడవల్లో చేరారు. కొన్ని జంటలు తమ పిల్లలతో కలిసి ఇక్కడకు వచ్చాయి. శుక్రవారం కూడా శ్రీలంకకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి భారత తీరానికి చేరారు. ఇప్పటి వరకు సుమారు 39 మంది భారత్లో ఆశ్రయం పొందేందుకు వచ్చారు. వీరిలో మహిళలతోపాటు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఆ దేశ ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. దీంతో పొట్టచేతపట్టుకుని పిల్లాజల్లాతో కలిసి పడవల్లో సముద్రంలో కష్టంతో ప్రయాణించి భారత్ చేరుతున్నారు.
కాగా, 81 బిలియన్ డాలర్ల శ్రీలంక ఆర్థిక పరిస్థితి కుప్పకూలింది. ఆ దేశం పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. విదేశీ నిల్వలకు మూడింతల మేర అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ద్రవ్యోల్భణం పెరగడంతో నిత్యవసరాలతోపాటు అన్ని ధరలు వందల రెట్లు పెరిగాయి.
మరోవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు సహాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బియ్యంతోపాటు చమురును నౌకల్లో పంపుతున్నది. తమిళనాడు ప్రభుత్వం కూడా సహాయానికి ముందుకు వచ్చింది. శ్రీలంకలోని తమిళులకు నిత్యావసరాలు, మందులు అందజేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఆయన కోరారు.