సుల్తాన్పూర్, అక్టోబర్ 7: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే గురువారం రాత్రి కుంగిపోయింది. ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు అందులో పడడంతో నలుగురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. వారు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. లక్నో నుంచి తూర్పు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ను అనుసంధానించే ఎక్స్ప్రెస్ వేను ఫిబ్రవరి-మార్చిలో యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2021 నవంబర్లో ప్రధానమంత్రి మోదీ ఆర్భాటంగా ప్రారంభించారు.
ఎడతెరిపిలేని వర్షాలకు నాణ్యతాలోపం బయటపడింది. రహదారిపై 15 అడుగుల గుంత ఏర్పడి, అందులో కారు చిక్కుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా, దవాఖానలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశారని, కానీ, ఒక్క వర్షానికే 15 అడుగుల గొయ్యి ఏర్పడిందని ట్విటర్ వేదికగా విమర్శించింది.