లక్నో: ఉత్తరప్రదేశ్లో ప్రతిరోజూ ఒక మంత్రి, ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారని ధరమ్ సింగ్ సైనీ తెలిపారు. ఈ నెల 20 వరకు ఈ రాజీనామా పరంపర కొనసాగుతుందని చెప్పారు. మంత్రి పదవితోపాటు బీజేపీకి గురువారం రాజీనామా చేసిన ధరమ్ సింగ్ సైనీ, సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘జనవరి 20 వరకు ప్రతి రోజు ఒక యూపీ మంత్రి, ఒక బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీని తాను ఎందుకు వీడిందన్నది కూడా ధరమ్ సింగ్ సైనీ వెల్లడించారు. ‘నేను చెప్పేది వినేవారు లేరు. ఒకానొక సందర్భంలో 140 మంది ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. వారంతా బెదిరింపులకు గురయ్యారు’ అని విమర్శించారు. ఐదేళ్లుగా దళితులు, వెనుకబడిన తరగతులను అణచివేశారని సైనీ ఆరోపించారు. వారి గొంతులను నొక్కారు కాబట్టి తాను రాజీనామా చేసినట్లు చెప్పారు.
స్వామి ప్రసాద్ మౌర్య ఏది చెబితే అది తాము చేస్తామని ధరమ్ సింగ్ సైనీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఒక మంత్రి, 3-4 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని చెప్పారు. జనవరి 20 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించారు.