న్యూఢిల్లీ, అక్టోబర్ 21: టీకా పంపిణీలో భారత్ ‘శతకోటి’ (వంద కోట్ల డోసులు) మైలురాయిని అధిగమించింది. 279 రోజుల్లో ఈ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియజేశారు. 130 కోట్ల మంది భారతీయుల సమిష్ఠి కృషితో నవచరిత్రను సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా దవాఖానను సందర్శించిన ఆయన.. వైద్యులు, సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. 100 కోట్ల డోసుల ఫీట్ను సాధించిన భారత్కు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు భూటాన్, శ్రీలంక వంటి దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. 100 కోట్ల డోసులకు సూచనగా దేశంలోని 100 వారసత్వ కట్టడాలు త్రివర్ణ పతాక వర్ణాలతో తళుకులీనాయి. కొవిడ్-19 పోరాటంలో ప్రాణాలు విడిచిన ఫ్రంట్లైన్ వర్కర్లకు నివాళులు అర్పించడంలో భాగంగా ఈ క్రతువును నిర్వహించినట్టు పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. వందకోట్ల డోసుల పూర్తికి సూచనగా కేంద్రప్రభుత్వం ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఈ గీతాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత కైలాశ్ ఖేర్ ఆలపించారు.
ఎప్పుడు.. ఎవరికి?
జనవరి 16: ఆరోగ్య సిబ్బందికి
ఫిబ్రవరి 2: ఫ్రంట్లైన్ వర్కర్లకు
మార్చి 1: 45-60 ఏండ్ల మధ్య ఉండి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి
ఏప్రిల్ 1: 45 ఏండ్లు పైబడిన అందరికీ
మే 1: 18 ఏండ్లు పైబడినవారికి
ఎంతమంది?
తొలి డోసు వేసుకున్నవారు: 75%
రెండు డోసులు వేసుకున్నవారు: 31%
వ్యాక్సినేషన్లో ఏ దేశం ఎక్కడ?
చైనా-223 కోట్ల డోసులు
భారత్-100 కోట్ల డోసులు
అమెరికా-41 కోట్ల డోసులు
బ్రెజిల్-26 కోట్ల డోసులు
జపాన్-18 కోట్ల డోసులు