పారిస్, నవంబర్ 11: ఐరోపా దేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తున్నది. వరుసగా గత ఆరు వారాల్లో వైరస్ కేసులతో పాటు మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన వారంలోనే కరోనా మరణాలు 10 శాతం పెరిగినట్టు డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, రష్యా, టర్కీ తదితర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, మరణాల శాతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. అయితే ఐరోపా దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఉక్రెయిన్, డెన్మార్క్, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్, బల్గేరియాలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. కేసుల పెరుగుదలతోపాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఐరోపా ప్రాంతం కరోనా విజృంభణకు కేంద్రంగా మారుతున్నదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ డాక్టర్ హన్స్ క్లుజ్ పేర్కొన్నారు.
ఈ పరిస్థితికి కారణాలేంటి?
జర్మనీ సహా పలు దేశాల్లో ఉచిత కరోనా పరీక్షలను నిలిపేశారు. ఒక్కో టెస్టుకు రూ.1700 వసూలు చేస్తున్నారు. దీంతో లక్షణాలు ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోలేదు. ఫలితంగా బాధితులను గుర్తించడంలో అధికారులు వెనుకబడ్డారు. టీకా వేసుకోవడంలో ప్రజలు అలసత్వం ప్రదర్శించడం. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడం కూడా ప్రభావం చూపించింది. కరోనా వ్యాక్సిన్లు తొలిసారిగా ఐరోపా దేశాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. టీకా వేసుకొని చాలాకాలం కావడంతో యాంటిబాడీల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
కట్టడికి ఇదే మార్గం
ఐరోపాలో నాలుగో దశ ఉద్ధృతి ప్రారంభమైందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయడం, టెస్టులను పెంచడం, ఆంక్షలను మళ్లీ కఠినతరం చేయడంతోనే వైరస్కు కళ్లెం వేయొచ్చని సూచిస్తున్నారు.