బీజింగ్: ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బిట్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. తమ కార్ల విక్రయానికి బిట్ కాయిన్లను అనుమతిస్తామని తొలుత ప్రకటించిన టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. తాజాగా యూటర్న్ చెప్పేశారు..
ఈ వరుసలో చైనా కూడా చేరిపోయింది. క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, వాటి చెల్లింపుల సేవల్లో చేరకుండా దేశీయ ఆర్థిక సంస్థలు, పేమెంట్ కంపెనీలపై నిషేధం విధించింది. స్పెక్యులేటివ్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో పాల్గొనవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. డిజిటల్ ట్రేడింగ్ మార్కెట్కు వ్యతిరేకంగా డ్రాగన్ తాజాగా చర్య తీసుకున్నది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్లైన్ పేమెంట్స్ చానెల్స్ తమ కస్టమర్లకు క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలను ఆఫర్ చేయొద్దని చైనా పేర్కొంది. క్రిప్టో కరెన్సీలో రిజిస్ట్రేషన్, ట్రేడింగ్, క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ వంటి సేవలు ఆఫర్ చేయొద్దని హెచ్చరించింది.
ఇటీవలి వరకు క్రిప్టో కరెన్సీల ధరలు ఆకాశాన్నంటే స్థాయిలో దూసుకెళ్లి, పడిపోయాయి. ట్రేడింగ్లో అనిశ్చితి గురై తిరిగి క్రిప్టో కరెన్సీ పుంజుకున్నది. అయితే ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లడంతోపాటు సాధారణ ఆర్థిక స్థితిగతులకు క్రిప్టో కరెన్సీ అంతరాయం కలిగిస్తున్నదని చైనా గుర్తు చేసింది.
క్రిప్టో ఎక్స్చేంజీలు, కాయిన్ల ఆఫరింగ్పై చైనా నిషేధం విధించింది. వ్యక్తులు క్రిప్టో కరెన్సీలు కలిగి ఉండటంపై ఆంక్షలు పెట్టలేదు. క్రిప్టో కరెన్సీలపై నిషేధాజ్ఞలు విధించడం చైనాకు ఇది మొదటి సారి కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో బిట్ కాయిన్ 90 శాతంగా ఉన్నప్పుడు 2017లో స్థానిక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలను నిషేధం విధించింది డ్రాగన్.
2019 జూన్లో దేశీయ, అంతర్జాతీయ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలను పొందడంపైనా, కాయిన్ ఆఫరింగ్ వెబ్సైట్లపైనా బ్యాన్ విధించిందని మూడు చైనా ఆర్థిక సంస్థలు తెలిపాయి. ఆ సంస్థలుగా నేషనల్ ఇంటర్నెట్ ఫైనాన్స్ అసోసియేషన్ ఆఫ్ చైనా, ది చైనా బ్యాంకింగ్ అసోసియేషన్, ది పేమెంట్ అండ్ క్లియరింగ్ అసోసియేషన్ ఆఫ్ చైనా ఉన్నాయి.