తిరువనంతపురం: శబరిమళ అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళ ప్రవేశంపైన, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని కేరళ క్యాబినెట్ నిర్ణయించింది. తీవ్రమైన నేరాలు కానందున ఆయా ఆందోళనలకు సంబంధించిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించామని కేరళ ప్రభుత్వం తెలిపింది. శబరిమళలో మహిళల ప్రవేశంపై నిషేధానికి వ్యతిరేకంగా గతంలో కొంతమంది మహిళలు ఆందోళనకు దిగారు. అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సమర్థిస్తూ మరోవర్గం ఆందోళనకు దిగింది.
ఆ ఆందోళనల సందర్భంగా కేరళలో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనల్లో పాల్గొన్న చాలామందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. అదేవిధంగా కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు కేరళలోనూ ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనలకు సంబంధించి కూడా పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. అయితే, ఆ రెండు ఘటనలకు సంబంధించిన కేసులన్నింటిని ఎత్తివేయాలని తాజాగా కేరళ క్యాబినెట్ నిర్ణయించింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే కేరళ ప్రభుత్వం కేసులను ఎత్తివేస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.