యాదగిరిగుట్ట, మే 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొన్నది. వేసవి సెలవులతోపాటు శనివారం వీకెండ్ కావడంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలో భక్తుల రద్దీ నెలకొన్నది. మాఢవీధుల్లో భక్తుల కోలాహలం కనిపించింది. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవసేవ జరిపారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణోత్సవం జరిగింది. సాయంత్రం ప్రధానాలయంలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 27 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.33,05,496 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, ఇండియన్ నేవీ ఛీప్ ఆఫీసర్ సంజయ్ వాస్తియన్, రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.