యాదగిరిగుట్ట, మార్చి21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శృంగార డోలారోహణంతో పరిపూర్ణమయ్యాయి. విశ్వక్సేన, పుణ్యాహవాచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భక్త జనులను కటాక్షించేందుకు దశావతారాలు, వివిధ వాహన సేవల్లో అనుగ్రహించిన లక్ష్మీనరసింహస్వామిని 108 కలశాలతో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో 108 వెండి కలశాలను ఏర్పాటు చేసిన ప్రధానార్చకులు కలశాలలో గంగాది సప్తనది జలాలను, పంచామృతాలు, ఔషధాలతో నింపి దర్భ, మామిడి ఆకులను, కొబ్బరికాయలు, వస్ర్తాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వేదపండితులు, రుత్వికులు పంచసూక్తాలు, దశ శాంతులు, నారాయణ సూక్తం, పంచోపనిషత్తు పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ గర్భాలయంలోని స్వయంభూమూర్తులు, సువర్ణ ప్రతిష్ఠామూర్తులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. అభిషేక మూర్తులు స్వామి, అమ్మవార్లను తులసీదళాలు, వివిధ రకాల పుష్పాలతో అర్చించిన అర్చకులు క్షేత్ర మహత్యాన్ని భక్తులకు వివరించారు.
అష్టోత్తర శతమనగా 108 కలశాలని, వీటిలో 25 తత్వాలు, 3 గుణాలు, 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 4 వేదాలు, 3 కాలాలు, 12 నెలలు, 12 ద్వాదశదిత్యులు వెరసి ప్రకృతిలోని అత్యంత విశిష్టమైన 108 తత్వాలను ఈ కలశాలు నిర్ధిశిస్తున్నాయని అర్చకులు తెలిపారు. దీని ద్వారా సమస్తం పరమాత్మ ఆధీనమని తెలుపుతున్నాయని వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో 11 రోజులపాటు నిర్విఘ్నంగా కొనసాగిన పూజా కైంకర్యాల్లో ఓలలాడిన కల్యాణ మూర్తులు లక్ష్మీనరసింహస్వామిని పట్టు పీతంబరాలు, ముత్యాలు, రత్నాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించి డోలికలో అదిష్టింపజేశారు. డోలారూఢుడైన స్వామిని సకల జగత్తును రక్షింపమని కోరుతూ సర్వవిధ రాగ తాళాలతో, సహస్రనామాలతో కొలుస్తూ శృంగార డోలారోహణ పర్వాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.
నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞాచార్యులు కిరణ్కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, ఈఈలు ఊడెపు రామారావు, దయాకర్రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్బాబు, రఘు, గట్టు శ్రవణ్కుమార్, పర్యవేక్షకులు సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 రోజులపాటు నిలిపివేసిన స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం నేటి నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. భక్తులచే నిర్వహించే శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమ పూజలు ఆరంభం కానున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్రావు వెల్లడించారు.