భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని వెంకంబావి తండా గ్రామానికి చెందిన రమావత్ శ్రీను అడవిలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా పని నిమిత్తం అడవిలోకి వెళ్లిన శ్రీనుపై ప్రమాదవశాత్తు బండరాయి (ఏనె గుండు) పడింది.
దాంతో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అడవికి వెళ్లిన శ్రీను ఇంటికి తిరిగి రాకపోవడంతో వెంకంబావి తండా వాసులు మంగళవారం సాయంత్రం నుంచి అడవంతా గాలించారు. ఈ క్రమంలో బుధవారం (ఇవాళ) ఉదయం 7.00 గంటలకు ఊడుగట్టు గుట్టలో ఓ బండరాయి కింద శ్రీను మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.