– జీ చెన్నారంలో ఎలాంటి అనుమతులు లేకుండా చెట్ల నరికివేత
– చోద్యం చూస్తున్న అధికారులు
నల్లగొండ రూరల్, జూన్ 23 : వన మహోత్సవం పేరుతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయాలు ఖర్చుచేసి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రచారం చేస్తుండగా మరో వైపు గ్రామాల్లో ఇష్టారీతిగా పెరిగిన వృక్షాలను నరికివేస్తూ వాటి కలపను సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ మండలంలోని జీ చెన్నారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇటీవల వచ్చిన గాలి దుమారానికి పాఠశాలలో ఒక చెట్టు కొమ్మ విరిగిపోయింది. దానిని తొలగించి ప్రమాదకరంగా వృక్షాలు ఉంటే వాటి కొమ్మలు తొలగించాల్సింది పోయి, ఇదే సాకుతో పాఠశాల ఆవరణంలో పెద్ద పెద్ద వృక్షాలను వాటి బలమైన కలపను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.అదే విధంగా జీ చెన్నారం స్టేజి నుండి గ్రామ పంచాయతీ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెద్ద వృక్షాలను కరెంట్ తీగలకు అడ్డుగా వస్తున్నాయనే సాకుతో వాటికి కలప వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఓ వైపు వన మహోత్సవం.. మరోవైపు వృక్షాల నరికివేత