నల్లగొండ, ఏప్రిల్ 30 : నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల విధులకు నియమించబడిన పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుంచి 4వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను పోలింగ్ సిబ్బంది రెండో విడుత ర్యాండమైజేషన్ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతోపాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను మే ఒకటి నాటికి సంబంధిత అధికారులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రెండో విడుత శిక్షణ కార్యక్రమాలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం రెండు గంటలకు రెండు విడుతల్లో వారికి కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులకు పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని, లేకుంటే ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఎంఈఓలు ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బందికి ఉత్తర్వులను అందజేసే ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకించి విద్యాశాఖకు సంబంధించిన ఉద్యోగులకు ఎంఈఓ ద్వారా, ఇతర ఉద్యోగులకు ఎంపీడీఓ ద్వారా అందజేయాలని ఆదేశించారు.
జిల్లా స్థాయి అధికారులు వారి పరిధిలో పనిచేసే మండల, డివిజన్ స్థాయి అధికారులకు, ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి శిక్షణకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 2, 3 తేదీల్లో పీఓ, ఏపీఓలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, 4వ తేదీ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు ఉంటాయని ఆమె తెలిపారు.