యాదగిరిగుట్ట, ఫిబ్రవరి2 : పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సోవాలు కనుల పండువగా సాగుతున్నాయి. స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. నరసింహుడి వరపూజ, వధువు లక్ష్మీదేవికి పూలు, పండ్ల కార్యక్రమాన్ని అర్చకులు కనుల పండువగా జరిపించారు.
నిశ్చయ తాంబూలాలు
రాత్రి 7 గంటలకు పట్టువస్ర్తాల అలంకరణలో అశ్వవాహనంపై నారసింహుడిని, ముత్యాల పల్లకిపై లక్ష్మీదేవిని ఆలయం నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా ప్రధాన మండపానికి తీసుకొచ్చారు. ఎదురెదురుగా స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి, శ్రీవారి వైపు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, అమ్మవారి వైపు ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు, అర్చక బృందం వైష్ణవ సంప్రదాయ రీతిలో సంబంధం ఖాయమైన ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములు, వేదపండితులు, పారాయణికులు తదితరులు కలిసి కల్యాణ ఒప్పందాన్ని కుదిర్చారు.
పెళ్లి కుమారుడిగా నారసింహుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీనరసింహుడు పెళ్లికుమారుడయ్యాడు. రాత్రి ఎదుర్కోలు కోసం ముందస్తుగా పెళ్లి కుమారుడిని చేసి శుక్రవారం జరిగే తిరుకల్యాణ మహోత్సవానికి రంగం సిద్ధం చేశారు. ఉదయం పెళ్లికొడుకైన శ్రీవారిని సింహవాహన అలంకారసేవలో భక్తుల సందర్శనార్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఉదయం తిరుమంజన ఉత్సవం జరిపి, శ్రీవారిని సింహవాహన సేవలో ఊరేగించారు. సింహవాహన విశిష్టతను ఆలయ ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు వివరించారు. ఈ వేడుకల్లో ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, ప్రధానార్చకులు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, డీఈఓ దోర్బాల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, అధికారి రామారావు నాయక్, ముఖ్య అర్చకులు భాస్కరాచార్యులు, అర్చకులు నరేశాచార్యులు, సంపతాచార్యులు, సత్యనారాయణాచార్యులు, పరిచారకులు వినయ్కుమారాచార్యులు, ఫణికుమారాచార్యులు, వేద పండితులు ఫణికుమారశర్మ, పవన్కుమారాచార్యులు, వినయ్కుమారాచార్యులు, పారాయణికులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శ్రీగాయత్రి మహిళా భజన మండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, హైదరాబాద్కు చెందిన దత్తసాయి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, భువనగిరికి చెందిన రమేశ్రాజ్ డ్యాన్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
నేడు తిరుకల్యాణ మహోత్సవం
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. పాతగుట్ట ఆలయ ప్రాంగణంలో గల కల్యాణ మండపాన్ని రంగులు వేసి, పూలు, అరటి మట్టలు, మామిడి తోరణాలు, విద్యుద్దీపాలంకరణ, సౌండ్ సిస్టంతో ముస్తాబు చేశారు. కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు కూర్చునేందుకు అన్ని వసతులు కల్పించారు. ఉదయం హనుమంత సేవలో, రాత్రి గజవాహన సేవలో ఊరేగి స్వామివారు కల్యాణ మహోత్సవానికి తరలివస్తారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.