రామగిరి, మార్చి 24 : ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సర్కార్ ఆ దిశగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా దానిలో అంతర్భాగం ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో భాషా విషయాలతో పాటు భాషేతర విషయాల్లో ప్రగతి సాధించేలా ఎస్సీఈఆర్టీ, రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది. ‘చదువు-ఆనందించు-అభివృద్ధి చెందు’ అనే నినాదంతో తొలి విడుతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 456 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయగా వీటిలో 240 కథలు, వైజ్ఞానిక పుస్తకాలతో పాటు పోస్టర్లు ఉండేలా అందజేశారు. విద్యార్థులంతా విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారిలో పఠన, మేథోశక్తి పెంచుకునే అవకాశం ఉండటంతో అంతాట హర్షం వ్యక్తమౌతుంది.
విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంచేలా విద్యా శాఖ పాఠశాల గ్రంథాలయాలను దశల వారీగా బలోపేతం చేయడానికి ప్రణాళిక రచించింది. తొలి విడుతలో రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 456 పాఠశాలలకు ఈ అవకాశం దక్కింది. తొలి విడుతగా ప్రతి జిల్లాలో 152 పాఠశాలల్లో వీటిని అందుబాటులోకి తెస్తూ ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఈ నెల 23, 24న ప్రత్యేక శిక్షణ సహితం పూర్తి చేసింది.
ప్రాథమిక స్థాయిలోనే తరగతి పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదువాలన్న జిజ్ఞాసను విద్యార్థుల్లో పెంచితే పుస్తక పఠనం మీద ఆసక్తి పెరుగుతుంది. వారి స్థాయిని బట్టి పుస్తకాలతో అనుబంధాన్ని పెంచేలా ప్రత్యేక పీరియడ్ కేటాయించి సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు చూస్తారు. ముఖ్యంగా పిల్లలకు పుస్తకాలను చేరువ చేయడం, ప్రతి రోజు గ్రంథాలయ పీరియడ్ కేటాయించడం చేయాలి.
ఆయా పాఠశాలల్లో గ్రంథాలయ నిర్వహణకై బాలల గ్రంథాలయ నిర్వహణ సమితిని హెచ్ఎం, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నియమించాలి. పర్యవేక్షణకై పాఠశాల యాజమన్య కమిటీని భాగస్వామం చేయాలి. విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘బుధవారం బోధన’ పేరుతో ప్రతి బుధవారం పిల్లలతో పుస్తకాలను బిగ్గరగా బాహ్య పఠనం చేయిస్తున్నారు. ఆ రోజు ప్రత్యేక పీరియడ్ అమలు చేస్తున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు చదివే అంశాలను ఉపాధ్యాయులు వీడియో, ఫొటోలు తీసి ఆయా తరగతి పిల్లల తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూప్లో పంపుతుండటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థుల పనితీరును ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్లో సహితం తెలుపుతున్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీఈఆర్టీ-రూమ్ టూ రీడ్ సంస్థ ఆధ్వర్యంలో తొలి విడుతలో 152 పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణకై డీఈఓ పర్యవేక్షణలో ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ అందించాం. అలాగే ఆయా పాఠశాలలకు 240 పుస్తకాలను అందజేశాం. వీటిని పాఠశాలలో ప్రత్యేక గదిలో ల్రైబరీ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పఠన సామర్థ్యాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేసి విద్యార్థుల సమగ్ర వికాసమే ధ్యేయంగా కార్యక్రమాలను విజయవంతంగా అమలయ్యేలా చూస్తున్నాం.
– ఆర్.రామచంద్రయ్య, సెక్టోరియల్ అధికారి, సమగ్రశిక్ష- నల్లగొండ
ఎస్సీఈఆర్టీ, రీడ్ టూ రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పాఠశాల గ్రంథాలయంలో 240 పుస్తకాలుంటాయి. వీటిలో 120 పుస్తకాలను రీడ్ టూ రీడ్ సంస్థ అందజేస్తుండగా మిగిలిన పుస్తకాలను నేషనల్ బుక్ ట్రస్ట్ నుంచి ఎస్సీఈఆర్టీ అందజేసింది. పుస్తకాలతో పాటు 7 పోస్టర్లు, 6 పెద్ద పుస్తకాలు సహితం ఉంటాయి. పాఠశాలలో ప్రత్యేక గది ఉంటుంది. దీనిలో బుక్రాక్/అల్మారాలు, రీడింగ్ టేబుల్, పిన్ డిస్ప్లే బోర్డు, కింద కూర్చోడానికి తివాచీ(కార్పెట్) ఉంటుంది. పుస్తకాల ప్రదర్శన రిజిస్టర్ నిర్వహిస్తారు. గ్రంథాలయంలో విద్యార్థుల ఆసక్తిని పెంచేలా బిగ్గరగా చదువడం, భాగస్వామ్య పఠనం, జతలుగా చదవడం, స్వతంత్య్ర పఠనం చేయిస్తారు. దీంతో విద్యార్థులో పఠన సామర్థ్యాలు పెరుగుతాయి.