బతుకమ్మ, దసరా పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సంతోషంగా ఇంటిబాట పట్టారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సొంత గ్రామాలకు బయల్దేరారు. దాంతో బస్టాండ్లు కిటకిటలాడాయి.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నట్లు పేర్కొన్నారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. పాఠశాలలకు సెలవుల ప్రకటనతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. హాస్టళ్లలో ఉండి చదివే తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతోపాటు విద్యార్థులతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా మారింది. ప్రయాణికులతో బస్సులన్నీ కిక్కిరిశాయి.