భూ తల్లిని నమ్ముకున్న రైతన్న తోటి రైతులతో వ్యవసాయ పనుల్లో పోటీ పడుతూ ముందుకు ‘సాగు’తూనే ఉన్నాడు. సీజన్ ప్రారంభంలో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతన్న పంట దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకుని విత్తనాలను కొనుగోలు చేస్తాడు. ఇదే అదునుగా కొన్ని విత్తన తయారీ కేంద్రాలు, వ్యాపార సంస్థలు నకిలీ విత్తనాలు అంటగట్టి అన్నదాతలను ఆర్థికంగా నష్ట పరుస్తున్నాయి. ఈ క్రమంలో వానకాలం సీజన్ సాగుకు సమాయత్తమవుతున్న రైతులు విత్తన తయారీలో అనుసరించాల్సిన విధానాలు, వాటి కొనుగోలులో పాటించాల్సిన పద్ధతులపై వ్యవసాయ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.
విత్తనం ఎలా ఉండాలి?
ఏ పంటల సాగులోనైనా విత్తనమే కీలకం. విత్తనాలు మంచి పరిమాణం, ఆకారం కలిగి ఉండాలి. జన్యు స్వచ్ఛత ఉండాలి. అంటే ఒక స్వచ్ఛమైన రకం విత్తనాన్ని నాటితే దాని నుంచి వంద శాతం అవే రకం విత్తనాలు రావాలి. అలాగే భౌతిక స్వచ్ఛత అంటే సగం తాలు నిండిన గింజలు, బెరుకులు ఉండకూడదు. మట్టి పెడ్డలు, ఇసుక, దుమ్ము వంటి జడ పదార్థాలు గానీ, కలుపు విత్తనాలు, ఇతర పంటల విత్తనాలు గానీ ఉండకూడదు. మొలక శాతం 80 కంటే ఎక్కువ ఉండాలి.
విత్తన తయారీ కేంద్రాల అనుమతి పొందాలంటే..
విత్తనాల తయారీ కేంద్రానికి అనుమతి పొందాలంటే తనకున్న అనుభవాన్ని, దానికి అనువైన ప్రాంతాన్ని తెలుపుతూ మండల వ్యవసాయాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి ఏడీఏకు తదుపరి జేడీఏకు ఆ దరఖాస్తు చేరి పూర్తిస్థాయి పరిశీలనలు చేసిన అనంతరం విత్తన తయారీకి అనుమతులు వస్తాయి. అనుమతి పొందిన తర్వాత విత్తన తయారీ కేంద్రాలు యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్న బ్రీడర్ విత్తనాలను నాటే క్షేత్రాల వివరాలను రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థలో నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్న క్షేత్రాల పరిశీలన కోసం విత్తన ధ్రువీకరణ సంస్థ అధికారులు కొంత ఫీజు వసూలు చేస్తారు.
అనంతరం బ్రీడర్ సీడ్ నాటిన క్షేత్రాలను వారు పరిశీలించి వాటి దిగుబడిని దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ సీడ్ సంచులకు అవసరమైన ట్యాగ్లు ఇస్తారు. వాటిని విత్తన సంచులకు అమర్చి విత్తన తయారీ కేంద్రాల యజమానులు అమ్ముకుంటారు. ఫౌండేషన్ సీడ్ను మళ్లీ నాటి వాటిని విత్తన ధృవీకరణ సంస్థలో నమోదు చేసుకుని తిరిగి సర్టిఫైడ్ విత్తనానికి సంబంధించిన ట్యాగ్లు పొంది సంచులకు అమర్చి రైతులకు విక్రయిస్తారు. అనుమతులు పొందిన విత్తన తయారీ కేంద్రంలో తయారు చేయబడిన విత్తనాలను వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. విత్తనాలు ఎలా ఉన్నాయి.. వాటిని ఏ సంచుల్లో నిల్వ చేశారు. సంచులపై విత్తనాలకు సంబంధించిన వివరాలను నమోదు చేశారా? వాటికి ఏ లాట్ నంబర్ కేటాయించారు? అనే వివరాలను పరిశీలిస్తారు.
విత్తన తయారీ ఇలా..
ఏదైనా కొత్త విత్తనాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని పరిశోధనా స్థానంలోనే బ్రీడర్ సీడ్ తయారు చేస్తారు. ఈ విత్తన సంచులకు పసుపు రంగు ట్యాగ్ వేస్తారు. బ్రీడర్ విత్త్తనాలను పరిశోధనా స్థానాల్లో, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇతర ప్రభుత్వ, ప్రైవేటు క్షేత్రాల్లో నాటి సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఫౌండేషన్ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తన సంచులకు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు. వీటి నుంచి రైతు పొలాల్లో సీడ్ సర్టిఫికేషన్ వారి పర్యవేక్షణలో వచ్చే దిగుబడులే సర్టిఫైడ్ విత్తనాలు. ఈ విత్తన సంచులకు నీలిరంగు ట్యాగ్ వేస్తారు. ఈ సర్టిఫైడ్ విత్త్తనాల నుంచి వచ్చినవే ట్రూత్ఫుల్ సీడ్. వీటికి ఆకుపచ్చ రంగు ట్యాగ్ ఉంటుంది. ఈ విత్తనాలన్నింటినీ గాలి సోకే గన్నీ బ్యాగుల్లోనే నిల్వ చేయాలి.
విత్తన కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డిమాండ్ ఉన్న రకాలను ఎంచుకోవాలి
నమ్మకమైన సంస్థ నుంచి బ్రీడర్ / ఫౌండేషన్ విత్తనాలను తీసుకుని వాటి ద్వారా పంట పండిస్తూ 3, 4 సీజన్ల వరకు విత్తనాలను రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవడం వల్ల రైతులకు విత్తన ఖర్చు తగ్గుతుంది. దీనికి ఏ విధమైన శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలను ఎంచుకోవడం ద్వారా రైతులు పండించిన పంటలను అమ్ముకోవడంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కావు. తక్కువ రేటుకు దొరుకుతున్నాయని ఏవి పడితే అవి కొనకూడదు. అన్ని రకాల పరిశీలనలు చేసి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడం మంచిది. విత్తన సంచులపై ట్యాగ్ చూసిన తర్వాతే కొనుగోలు చేయాలి.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి