పెద్దవూర, జూన్ 04 : భూభారతి చట్టం అమలులో భాగంగా అపరిష్కృతంగా ఉన్న రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం పెద్దవూర మండలంలోని వెల్మగూడెం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరై రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారితో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో సాదాబైనామాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సక్సేషన్స్ విస్తీర్ణంలో తప్పుల సవరణ, భాగ పంపిణి తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు.
రెవెన్యూ సదస్సులు నిర్వహించే విషయాలను రెవెన్యూ అధికారులు ముందుగానే ఆయా గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. వెల్మగూడెంలో సుమారు 70 వరకు దరఖాస్తులు రాగా వీటిలో సాదాబైనామాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సక్సేషన్ల కరెక్షన్, భాగ పంపిణి, శివాయ్ జమేదార్, పట్టా పాస్బుక్లో తప్పుల సవరణకు సంబంధించి ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. లావుని పట్టా భూములు పట్టా చేయడం కుదరదని, అదేవిధంగా ప్రభుత్వ భూములు కొన్న వారికి రెగ్యులరైజేషన్ చేయడం జరగదన్నారు. జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే రెవెన్యూ సదస్సులో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇనాం భూముల ఓఆర్డీసీ డాక్యుమెంట్లు లేని భూములు తదితరాల గురించి తెలిపారు.
రైతులు తప్పనిసరిగా వారి భూమికి సంబంధించిన కాగితాలను కలిగి ఉంటే సులభంగా పట్టా అవుతుందని, పట్టాలు పొందడం వల్ల రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలన్నింటిని పొందవచ్చని, ప్రత్యేకించి రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు వంటివి తీసుకోవచ్చని తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని వారికి సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, తాసీల్దార్ శ్రీనివాస్రావు, ఆర్ఐ శ్రీనివాస్రెడ్డి, హబీబ్ అలీ పాల్గొన్నారు.
Peddavoora : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు : కలెక్టర్ ఇలా త్రిపాఠి