ప్రజలకు తెలిసేలా అభివృద్ధి పనులు, నిధుల సమాచారం
నేరేడుచర్ల, జూన్ 19 : పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన పనులు, మంజూరైన నిధుల వివరాలను గ్రామ పంచాయతీ గోడలపై ప్రజలకు తెలిసే విధంగా ప్రచురించాలని ఉన్నతాధికారులు సర్క్యులర్ విడుదల చేశారు. దీంతో స్థానిక సిబ్బంది నివేదికలను సిద్ధం చేసి గ్రామ పంచాయతీ గోడలపై ప్రచురించారు.
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి పనులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2014 సెప్టెంబర్లో ప్రారంభించిన పల్లె ప్రగతి ద్వారా ఇప్పటి వరకు ఆయా గ్రామలకు విడుదలైన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, నిర్మించిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, రైతు వేదికలు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ ఇచ్చిన నల్లా కనెక్షన్లు, విద్యుత్ స్తంభాల మార్పిడి, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు సేకరించి వాటిని గ్రామ పంచాయతీ గోడలపై రాయించారు. గ్రామంలో గత నాలుగు విడుతలుగా పల్లె ప్రగతిలో జరిగిన పనుల వివరాలను సైతం ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాటు చేశారు.
పల్లె ప్రగతితో మార్పు
గతంలో నిధుల కొరతతో పల్లెల్లో సమస్యలు పేరుకుపోయేవి. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంతో పేరుకు పోయిన సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నది. ఇందుకోసం గ్రామ పంచాయతీకి నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నది. వీటికి తోడు గ్రామ పంచాయతీకి వివిధ రూపాల్లో పన్నులు రావడంతో పల్లెల్లో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. దీంతో పల్లె సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రగతి నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి నివేదిక బోర్డులు ఏర్పాటు చేశాం. పంచాయతీ కార్యాలయం గోడలపై నివేదికను వివరంగా రాశాం. ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులు, మంజూరైన నిధులు, వాటి ఖర్చు తదితర వివరాలను ఈ నివేదికలో పొందుపర్చాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు పొందుపర్చడం ద్వారా జరిగిన అభివృద్ధి గ్రామస్తులందరికీ తెలుస్తుంది.
– శంకరయ్య, ఎంపీడీఓ నేరేడుచర్ల