వానకాలం సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. సరైన వర్షాలు కురిస్తే అదును మీద విత్తనాలు వేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే మెట్ట ప్రాంతాల్లో దుక్కులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు సాగు బాటలో రైతులకు చేదోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. సీజన్లో పంటల వారీగా సాగు అంచనాలను తీసుకుని అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి కేంద్రీకరించింది.
ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.75లక్షల ఎకరాల్లో వరి, 10.13లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తున్నది. సీజన్ ఆరంభంలో కీలకమైన విత్తనాల్లో కల్తీకి అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖతో ప్రత్యేకంగా నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖతో కూడినప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కట్టుదిట్టమైన చర్యలు మొదలుపెట్టాయి. త్వరలో జిల్లాల వారీగా ప్రత్యేక సమీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే27(నమస్తే తెలంగాణ) :స్వరాష్ట్రంలో సర్కార్ సాయానికి తోడు ప్రకృతికి కలిసి వస్తుండంతో కొన్నేండ్లుగా వానకాలం సాగు సకాలంలోనే మొదలువుతూ వస్తున్నది. మృగశిర కార్తెతోపాటు వచ్చే వర్షాలకు త్వరలోనే నైరుతి రుతుపవనాలు కూడా తోడు కానున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం రైతులకు అన్నిరకాల అండదండలతో పలు చర్యలు చేపట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానకాలం సాగుకు సర్వం సిద్ధమైంది. మెట్ట, తరి భూముల్లోనూ రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయ్యారు.
మెట్టప్రాంతాల్లో పత్తితోపాటు కంది ఇతర పంటల సాగుకు రైతులు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేస్తున్నారు. ఇంకా చేయని వారు సైతం అదును కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నాన్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద వరి సాగు చేసే రైతులు సైతం వరినాళ్లకు సిద్ధమవుతున్నారు. భారీవర్షం పడితే నారుమళ్లను కూడా సిద్ధం చేసే యోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ వానకాలం సీజన్లో సాగు ప్రణాళికను జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు.
వచ్చే వారం రోజుల్లో మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష అనంతరం సాగు ప్రణాళికను ఆమోదించనున్నారు. ఇప్పటివరకు అధికారులు ప్రాథమికంగా పంటల వారీగా సాగు విస్తీర్ణం, అందుకు అనుగుణంగా అవసరమైన విత్తనాలు, ఎరువులు అంచనాలు రూపొందించారు. వీటిల్లో ఇప్పటికే జిల్లాలో అందుబాటులో ఉన్న వాటి వివరాలను కూడా సిద్ధంగా ఉంచారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ వానకాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 22లక్షల ఎకరాల పైచిలుకు సాగు కానున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 22,10,450 ఎకరాల్లో సాగు అవుతాయని అంచనా. ఇందులో వరి, పత్తి పంటలదే అగ్రస్థానం కావడం విశేషం. అత్యధికంగా వరి సాగు 10.75లక్షల ఎకరాల్లో తర్వాత పత్తి పంట కొద్ది తేడాతో 10.13లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనాలు రూపొందించారు. సమైక్య రాష్ట్రంలో వరిసాగు నాలుగైదు లక్షల ఎకరాలకు మించి సాగు అయ్యేది కాదు. కానీ నాలుగైదేండ్లుగా కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, సాగర్ ద్వారా కృష్ణాజలాలకు తోడు మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల పటిష్టతతో సాగునీటి వసతి గణనీయంగా పెరిగింది. దీంతో కాల్వలకు తోడు బోరు, బావులపై వ్యవసాయం మరింతగా పెరుగడంతో వరి సాగు రెట్టింపు అయ్యింది. ఇదే సమయంలో పత్తి పంటకు సైతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతులు మెట్ట ప్రాంతాల్లో పత్తి సాగుకు పెద్ద ఎత్తున ఉపక్రమిస్తున్నారు. ఇక వీటితో పాటు కంది పంట 86,600 ఎకరాల్లో సాగుకానున్నట్లు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో మాత్రమే మిర్చి పంట 20,500 ఎకరాల్లో సాగు కావచ్చని భావిస్తున్నారు. ఇవి కాకుండా మిగతా విస్తీర్ణంలో వేరుశనగ, పెసర, జొన్న, ఇతర పప్పుధాన్యాలు సాగు కానున్నాయి. ఇందుకు అనుగుణంగా అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడంపై అధికారులు దృష్టి సారించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో అవసరమైన ఎరువులు, విత్తనాలను ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తంగా అవసరాన్ని బట్టి విడుతల వారీగా జిల్లాలకు వచ్చేలా చూడనున్నారు. విత్తనాలకు సంబంధించి 10.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు 27.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటిలో చాలా వరకు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఇక వరి సాగుకు సంబంధించి 2.23లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. వీటిల్లో తక్షణమే నారుమళ్లకు అవసరమైన విత్తనాలు మార్కెట్లకు వచ్చి ఉన్నాయి. వర్షాలను బట్టి సాగు అవసరాలను బట్టి వీటిని విడుతల వారీగా అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఈ సీజన్కు సంబంధించిన ఎరువులపైనా అంచనా రూపొందించారు. ఉమ్మడి జిల్లాకు మొత్తం 2.50లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.60 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 70,504 మెట్రిక్ టన్నుల డీఏపీతో పాటు 46,230 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు, 23,986 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు అవసరం కానున్నట్లు అంచనా వేశారు. వీటిల్లోనూ ఇప్పటివరకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచారు. మిగతా ఎరువులను పంటల అవసరాలకు అనుగుణంగా తెప్పించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఇక సీజన్ ప్రారంభంలో ప్రతియేటా కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు చలామణిలోకి రావడం సర్వసాధారణంగా ఉండేది. కానీ కొన్నాళ్లు వీటి విషయంలోనూ ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తున్నది. ఇక నాసిరకం విత్తనాలకు సంబంధించి ఒక్క నల్లగొండ జిల్లాలోనే 2016-17 నుంచి 2020-21వరకు మొత్తం 21 కేసులు నమోదయ్యాయి. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అప్పటి ఎస్పీ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా పెట్టి నకిలీల ఆటకట్టించారు. చండూరు సర్కిల్లో ఓ చిన్న సమాచారంతో తీగ లాగితే జిల్లా అంతటా నకిలీ విత్తనాల డొంక కదిలింది. నల్లగొండ, దేవరకొండ, చండూరు, నకిరేకల్ డివిజన్ల పరిధిలో మొత్తం 16 మందిని అరెస్టు చేసి 420 కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇక అంతకుముందు ఏడాది కూడా మొత్తం ఏడు కేసులు నమోదు చేసి పలువురిని జైలుకు పంపారు. వరుసగా నకిలీ విత్తన దందాతో సంబంధం ఉన్న పలువురిపై గతేడాది పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా వ్యవహరించారు. ఈ ఏడాది సైతం వానకాలం సీజన్ ప్రారంభంలోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీటిపై మరింత కఠినంగా వ్యవహరించాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. విత్తన విక్రయ ఏజెన్సీలను తనిఖీ చేస్తూ ముందుకు సాగుతున్నది. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో నిఘా పెట్టారు.
గతంలో నకిలీ విత్తన దందాతో సంబంధం ఉన్న వారి కదలికలపైనా దృష్టి సారించారు. వీరి పాత్ర మళ్లీ ఎక్కడైనా కనిపిస్తే పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
నీరు, పోషకాల నిల్వ సామర్థ్యం పెంపు పంటకు చేకూరనున్న నత్రజని.. తగ్గనున్న కలుపు మొక్కల ఉధృతి
గరిడేపల్లి, మే 27 : సాగు చేసిన పంటల నుంచి అధిక దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో రైతులు అధిక రసాయనిక మందులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతినడంతోపాటు పంటలు సూక్ష్మ, స్థూల పోషకాల లోపాలు, చీడపీడల ఉధృతికి లోనవుతున్నాయి. రసాయనిక ఎరువులకు బదులుగా పచ్చిరొట్టను వాడడం వల్ల భూసారం పెంచుకోవడంతో పాటు పెట్టుబడిని తగ్గించుకోవచ్చని గడ్డిపల్లి కేవీకే మృత్తికా శాస్త్రవేత్త అరిగెల కిరణ్ వివరించారు.
జనుము : అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. దీనిని పచ్చిరొట్టగా, పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఎకరాకు 12- 15 కిలోల విత్తనం చల్లుకోవాలి. 5-6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.
జీలుగు : వరిని పండించే క్షార గుణం, చౌడు భూముల్లో జీలుగు వేయాలి. ఎకరాకు 10- 12 కిలోల విత్తనం ఇసుకతో కలిపి చల్లడం వల్ల పొలంలో అంతా సమానంగా పడుతుంది. దీనిని పూత దశలో కలియ దున్నడం వల్ల ఎకరాకు 9- 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.
పిల్లి పెసర : దీనిని తేలిక, బరువైన నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. ఎకరాకు 6- 8 కిలోల విత్తనం అవసరం. ఎకరాకు 3- 4 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.
అలసంద : ఎకరాకు 4- 6 టన్నుల దిగుబడి వస్తుంది. ఎకరాకు 6- 8 కిలోల విత్తనం అవసరం. పూతదశలో కలియదున్నాలి.
కావాల్సిన సేంద్రియ పదార్థం లభించడమే కాకుండా నేల భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగుపరుస్తాయి.
కోతకు గురికాదుపంటకు అందుతుంది.మొక్కల ఉధృతిని అదుపు చేస్తాయి ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెంచుతాయి కుళ్లడం వల్ల నీరు, పోషక పదార్థాలను నిలువ చేసుకునే శక్తి నేలకు పెరుగుతుంది పైర్లు నేల అడుగు పొరల నుంచి పోషకాలను తీసుకుని పైర్లు కుళ్లిన తర్వాత సాగు చేసే పంటకు అందిస్తాయి. చౌడు సమస్య తగ్గుతుంది.ఎరువులపై పెట్టే ఖర్చు 16- 20 శాతం మేర తగ్గుతుంది.
నేరేడుచర్ల, మే 27 : రైతు తన పొలంలో అధిక దిగుబడి పొందాలన్నా, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నా ముందుగా భూసార పరీక్షలు చేయించాలి. మట్టి స్వభావం తెలుసుకొని పంటలు పండించుకోవాలి. వరి కోతలు ముగిసిన నేపథ్యంలో భూసార పరీక్షలు చేసే సమయమిదేనని అధికారులు చెప్తున్నారు.
రైతు తన పొలంలో ఒక ఎకరంలో కనీసం ఆరు నుంచి ఎనిమిది చోట్ల ఆంగ్ల అక్షరం వీ ఆకారంలో ఆరు నుంచి ఎనిమిది అంగుళాల లోతు వరకు అంచు మట్టిని తీయాలి. నమూనాలను బాగా కలిపి శుభ్రమైన గోనె సంచిలో తీసుకోవాలి. ఆ మట్టిని నీడలో పరిచి ఆరబెట్టాలి.మట్టిని ఒక పొరగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి.
ఎదురుగా ఉన్న మట్టిని తీసుకుని మిగిలిని మట్టిని పారేయాలి. ఇలా కనీసం అరకిలో మట్టి వచ్చే వరకూ తీసుకోవాలి. ఇలా తీసుకున్నమట్టిని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి రైతు వివరాల చీటిని అందులో ఉంచాలి. భూసార పరీక్షల కేంద్రానికి వ్యవసాయశాఖ అధికారి ద్వారా పంపించాలి. భూసార పరీక్ష కేంద్రంలో పరీక్ష చేసి మట్టిలో ఉన్న ఉదజని, లవణాలు, సేంద్రియ కర్భనాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ తదితర పోషకాల స్థాయిని అధిక దిగుబడికి వాడాల్సిన ఎరువుల మోతాదును సూచిస్తారు.
భూసార పరీక్షకు సేకరించిన మట్టిని గతంలో వ్యవసాయాధికారులు పరీక్ష కేంద్రాలకు పంపిస్తే 10 నుంచి 15రోజుల్లో ఫలితాలు ఆన్లైన్లో ఉంచేవారు. దీంతో పాటు రైతుకు భూసార పరీక్షలకు సంబంధించిన ఆరోగ్య కార్డును అందజేసేవారు. ఇప్పుడు నూతనంగా భూసార పరీక్షలు చేయడానికి ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. రైతులు తమ భూమిలోని మట్టి నమూనాను తీసుకొని ర్యాపిడ్ టెస్ట్ చేసే కార్యాలయానికి చేరుకొని రూ. 30 చెల్లిస్తే భూసార పరీక్ష చేసి ఫలితాలను తెలుపుతారు.
ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాల స్థాయిని తెలుసుకోవచ్చు.మట్టి పరీక్షల ఫలితాలతో ఏ పంట వేయాలి. ఏ పంటకు ఏయే ఎరువులు ఏ మోతాదులో వేయాలి అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. పంట పొలాల్లో చౌడ ఆమ్లస్థాయిని నిర్ధారించి వాటిని తగ్గించేందుకు అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించే అవకాశం ఉంటుంది. ఎరువులపై అనవసర ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.