నల్లగొండ ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ) : 2021 మార్చిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ జరిగింది. మొత్తం 3,87,969 మంది ఓట్లు వేయగా అందులో 21,636 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇది మొత్తం పోలింగ్లో 5.57శాతం కావడం గమనార్హం. ఇక ఇదే తరహాలో 2015 మార్చిలో జరిగిన ఎన్నికలోనూ మొత్తం పోలైన ఓట్లలో 9.14శాతంతో 14,039 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇవేవో సాధారణ ఎన్నికలు అనుకుంటే చదువు రాని నిరక్షరాస్యులు, అంతంతమాత్రం చదువొచ్చినోళ్లు కూడా ఓటర్లలో ఉన్నారనుకోవచ్చు.
కానీ పట్టభద్రుల ఎన్నికలు.. అందరూ డిగ్రీ, ఆపై చదువులు పూర్తి చేసిన వారే ఓటర్లుగా ఉంటారు. అయినా చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా ఉంటుండడం తీవ్ర ఆందోళనకర అంశమే. అందుకే నేడు జరుగబోయే పోలింగ్లోనూ ఎన్నికల నిబంధనలపై పట్టభద్రులైన ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటింగ్కు వెళ్లాల్సిందే. అవసరమైతే ఓటింగ్కు వెళ్లేముందు మరోసారి ఓటింగ్ విధానం తెలుసుకుంటే మరీ మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం ఎనిమిది గంటల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా 12 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 605 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రానికే పోలింగ్ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే ఏజెంట్ల నియాయక ప్రక్రియ ఆ తర్వాత నిర్ణీత సమయం ప్రకారం పోలింగ్ మొదలుపెడతారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ సారి కూడా భారీ సంఖ్యలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతోపాటు ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. మొత్తం 4,63,839 మంది ఓటర్లకుగానూ 2,88,189 మంది పురుషులు, 175,645 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
ఈ సారి అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్ సైజ్ భారీగా ఉండనుంది. బ్యాలెట్ పేపర్ మూడు వరుసల్లో ఉండనుంది. ఇందులో అభ్యర్థుల వివరాలు, ఫొటోలను పొందుపరిచారు. దీన్ని మూడు మడతలుగా చేసి పెన్తోపాటు బ్యాలెట్ పేపర్ను ఓటరు చేతికి ఇస్తారు. ఓటు వేసేందుకు కేటాయించిన సీక్రెట్ స్థలంలో బ్యాలెట్ పేపర్ను పూర్తిగా విప్పదీసి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ సారి ఓటు వేసేటప్పుడు పట్టభద్రుడైన ఓటరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. తాను ఓటు వేయాల్సిన అభ్యర్థి లేదా అభ్యర్థులు ఎక్కడ ఉన్నారో జాగ్రత్తగా పరిశీలించి ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటరు కూడా తొలి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందే. ఇలా ఇవ్వనిచో ఆ ఓటు చెల్లుబాటు కాదు. తర్వాత ఎన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా వాటిని పరిగణలోకి తీసుకోరు.
ఓటర్లంతా పట్టభద్రులే… కనీసం డిగ్రీ చదువు పూర్తి చేసి ఆ విద్యకు తగ్గ ప్రత్యేక ఓటు పొందిన మేధావులు. వాళ్లలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వంటి వారు ఉన్నారు. అయితేనేం అంతటి మేధావులు సైతం ఓటేయడంలో తప్పటడుగు వేశారు. అందుకే 2021 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లల్లో 5.57శాతం ఓట్లు చెల్లకుండా పోయాయి.
3,87,969 మంది ఓటు వేయగా 21636 మంది ఓట్లు చెల్లలేదు. 2015 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్లేసిన ఓట్లలో 9.14శాతం చెల్లుబాటు కాలేదు. మొత్తం 1,53,547 ఓట్లు పోలుకాగా 14,039 ఓట్లు చెల్లుబాటు కాలేదు. గతంలో జరిగిన పొరపాట్లను ఓ సారి పరిశీలిస్తే.. ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యతలను పెన్నుతో స్పష్టంగా అంకెల్లో రాయాలని ఉన్నా… చాలా మంది అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న డబ్బాలో టిక్ చేసి కనిపించాయి. కొందరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వకుండానే ద్వితీయ, తృతీయ ఓట్లు వేశారు. మరికొందరైతే బ్యాలెట్ పత్రాలపై ఏవేవో రాతలు రాశారని కూడా తెలిసింది. ఇలా మొత్తం పోలైన ఓట్లలో అవగాహన లోపంతో తమ ఓట్లను వృథా చేసుకున్నట్లుగా స్పష్టమవుతున్నది.
బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా వారి ఫొటో ఆ తర్వాత ఓటు వేసేందుకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లోనే మనం ప్రాధాన్యత ఓటును అంకెల్లో వేయాల్సి ఉంటుంది. ఇలా అంకెల్లో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా బాక్స్ మధ్యలో స్పష్టంగా అర్థమయ్యేలా రాయాలి. బాక్స్ చివరల్లో లేదంటే బాక్స్ దాటి అటుఇటు అంకెలు రాసినా వాటిని పరిగణలోకి తీసుకోరు.
ఇంకో విషయమేమింటే ఈ సారి బ్యాలెట్ పేపర్లో మూడు వరుసల్లో అభ్యర్థుల జాబితా ఉంటుంది. ఓటు వేయాలనుకున్న అభ్యర్థి ఎదురుగా ఫొటో పక్కనే ఉన్న గడిలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో అనుమానాలు ఉంటే పోలింగ్ అధికారిని అడిగి తెలుసుకోవచ్చు. ఓటింగ్కు వచ్చే ప్రతి ఓటరు పూర్తి అవగాహనతో వస్తే ఈ సారి చెల్లని ఓట్లను నివారించినట్లవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని నమ్మి పోలింగ్ కేంద్రానికి వచ్చి తప్పు చేస్తే ఫలితం లేదు.
ఓటు వేసే సమయంలో ప్రతి ఓటరు ప్రథమ ప్రాధాన్యత ఓటును వేయాల్సిందే. తర్వాత తనకు నచ్చిన ఇతర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు చేయవచ్చు. మొత్తం 52 మంది అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే స్వేచ్ఛ ఓటరుకు ఉంటుంది. ఇలా ఓటు వేసే క్రమంలో ఎక్కడా కూడా ప్రాధాన్యత క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఓటు వేసేటప్పుడు కచ్చితంగా ఇంగ్లిష్ లేదా రోమన్ అంకెల్లో ఓటు వేయవచ్చు. సులువైన పద్ధతి అయితే ఇంగ్లిష్ అంకెలను వాడడమే.
ఉదాహరణకు అభ్యర్థికి 50వ ప్రాధాన్యత ఓటు ఇవ్వాలనుకుంటే రోమన్ అంకెల్లో ఓటు వేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అదే ఇంగ్లిష్ అంకెల్లో అయితే ‘50’ ఇలా వేస్తే సరిపోతుంది. అందుకే ఇంగ్లిష్ అంకెలుగా పిలువబడే ‘1,2,3,4,5,…. 71’ వరకు ప్రాధాన్యతలు ఇస్తూ వెళ్లవచ్చు. ఇలా అంకెలు కాకుండా అక్షరాల్లో రాస్తే అవి చెల్లుబాటు కావు. ఉదాహరణకు ‘ఒకటి, రెండు, మూడు, నాలుగు…. డబ్బు ఒకటి’ ఇలా రాస్తే ఆ ఓటు చెల్లని ఓటు కిందే లెక్క. ఇక ఇవి కాకుండా రైట్ లేదా ఇతర గుర్తులు, చిహ్నాలు ఇవేవీ బ్యాలెట్ పేపర్ పైన రాసినా అవి కూడా చెల్లని జాబితాలోకే వెళ్తాయి.