సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): భూముల పరిరక్షణ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని, క్షేత్ర స్థాయిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ దాన కిశోర్ సూచించారు. మెట్రోపాలిటన్ కమిషనర్గా సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టిన దాన కిశోర్ మంగళవారం అమీర్పేటలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) కార్యాలయంలో హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలితో కలిసి వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఎస్టేట్ విభాగం అధికారులతో హెచ్ఎండీఏకు సంబంధించిన భూముల వివరాలపై ఆరా తీశారు. ఇటీవల శంషాబాద్లోని భూములపై వెలువడిన కోర్టు తీర్పు వివరాలను, దాని పరిరక్షణకు తీసుకుంటున్న విషయాలను అధికారులు కమిషనర్కు వివరించారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకొని హెచ్ఎండీఏకు చెందిన భూములు కబ్జాకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ దాన కిశోర్ సూచించారు. ముఖ్యంగా శంషాబాద్లోని హెచ్ఎండీఏకు చెందిన భూముల్లో ఉన్న కబ్జాలను వెంటనే తొలగించి, స్వాధీనం చేసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
ఓఆర్ఆర్ ప్రాజెక్టు అధికారులతో సుదీర్ఘ సమీక్ష..
ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వేర్వేరుగా కమిషనర్ దాన కిశోర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నతాధికారులతో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహించారు. ఓఆర్ఆర్కు సంబంధించిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్జీసీఎల్) కార్యకలాపాలు, ఓఆర్ఆర్ చుట్టూ ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులు, ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టులపైనా చర్చించినట్లు సమాచారం. మొత్తంగా హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో రోజు నుంచే సుదీర్ఘంగా ఒక్కో విభాగం కార్యకలాపాలను సమీక్షించడంతో అధికారులను కొంత కలవరానికి గురి చేసింది. అదేవిధంగా హెచ్ఎండీఏ కీలక విభాగమైన పట్టణ ప్రణాళిక (ప్లానింగ్) విభాగం ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రణాళికా విభాగంలోని డైరెక్టర్లు, ప్లానింగ్ ఆఫీసర్స్(పీఓ), అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్స్ (ఏపీఓ)లతో సమావేశమై భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల జారీ విషయాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఎవరెవరు ఏ స్థాయి వరకు భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో నాలుగు జోన్లు శంకర్పల్లి , శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్లు ఉండగా, ఒక్కో దాని పరిధిలో అనుమతులు ఏవిధంగా ఉన్నాయి. మాస్టర్ ప్లాన్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని అధికారులతో చర్చించారు.