గుర్రంపోడు, ఆగస్టు 26 : గుర్రంపోడు మండలంలోని తాసీల్దార్ కార్యాలయానికి వచ్చిన 32 కల్యాణలక్ష్మీ- షాదీ ముబారక్ చెక్కులను వెంటనే లబ్ధిదారులుకు అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకంపై హైకోర్టు స్టే విధించిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు సంక్షేమం కోసం రైతు బీమా ప్రవేశ పెట్టి అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఆగస్టు 14న గడువు ముగిసినా పునరుద్ధరణ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 22ఏ ని ఎత్తివేస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత మరికొన్ని భూములను 22ఏ లోకి చేర్చి రైతాంగాన్ని నట్టెట ముంచిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రద్దు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి వచ్చిన కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందించకుంటే తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మునుకుంట్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.