– ప్రధాని బీసీలకు మాట ఇచ్చి తప్పడం దుర్మార్గం
– బీసీ గణననపై ఈ 20న హైదరాబాద్ లో జాతీయ సదస్సు
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 03 : జాతి జనగణనలో బీసీ కాలం చేర్చకుండా కులగణన చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటని, బీసీలను నమ్మించి వంచించిన బిజెపి ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని, త్వరలోనే దేశంలోని బీసీలంతా ఒక్కటై బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా అగ్రకుల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాయన్నారు, బీసీ కుల గనణ చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడే బీపీ మండల్ స్పష్టంగా సిఫార్సు చేసిన స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు గడచినప్పటికీ నేటి వరకు అమలు చేయకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు. బిజేపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారపక్షంలోకి వచ్చినప్పుడు బీసీ కులగణన చేస్తామని మాట ఇచ్చి తీరా కులగనన జరుగుతున్న ఈ సమయంలో అస్పష్టంగా, అశాస్త్రీయంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అందులో 40 ప్రశ్నలు పొందుపరిచిందని ఆయన తెలిపారు, కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బీసీ జాబితా ప్రకటించి, కులాలకు ఒక కోడ్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని 48 గంటల దీక్ష చేస్తున్న బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావును అభినందిస్తున్నామని, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు 42 శాతంకు పెంచిన బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని కూడా డిమాండ్ చేయాలన్నారు. బిసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా రిజర్వేషన్లు కులగనణ కూడా అంతే కంటే ఎక్కువ ముఖ్యమన్నారు, బిజెపికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి కులగణనపై సానుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని జాజుల డిమాండ్ చేశారు.
బీసీ కులాల లెక్కలు తీయడానికి కేంద్రం భయపడుతుందని, బీసీ కులాల లెక్కలు తేలితే రిజర్వేషన్లు కూడా అదే స్థాయిలో పెంచాల్సి ఉంటది అనే విషయం వారికి స్పష్టంగా తెలుసని వారు అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లు అయిన తర్వాత కూడా బీసీలు మెజార్టీగా ఉండి కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుపడాల్సిన అంశం అని, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా చూడాలని వారు కోరారు బీసీ కులగనన చేపట్టకపోతే ఢిల్లీ పెద్దలపై బీసీల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా బిసి ఉద్యమాన్ని ఉధృతం చేయాడానికి ఈనెల హైదరాబాద్ లో 29 రాష్టాల బీసీ ప్రతినిదులతో ఓబీసీ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.