తుంగతుర్తి, ఏప్రిల్ 10 : విద్యుత్ శాఖలో కొన్నేండ్లుగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్మికులు గత మూడు రోజులుగా డివిజన్ కార్యాలయాల ముందు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇది ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమని ఆరోపించారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పెద్దలు అధికారం రాగానే పర్మినెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకుని రెండున్నర ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు.