– ముస్లింల ర్యాలీ, అన్నదానం
రామగిరి, ఆగస్టు 26 : ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను నల్లగొండ జిల్లా కేంద్రంలో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ అధ్యక్షుడు సల్మాన్ ఖాద్రి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో నగర పురవీధులు మహమ్మద్ ప్రవక్త ప్రేమతో మార్మోగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లగొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ (అమేర్), వన్టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. లతీఫ్ సాహెబ్ దర్గా మెట్ల వద్ద ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్, ఆర్పీ రోడ్డు, వన్టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ బజార్ మీదుగా కొనసాగి తిరిగి దర్గా మెట్ల వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. ప్రవక్త మహమ్మద్ చూపిన ప్రేమ, శాంతి, దయ, సోదరభావం, సత్ప్రవర్తనా సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నుండి విచ్చేసిన ప్రముఖ నాత్ గాయకులు పాదయాత్ర చేస్తూ ప్రవక్త మహమ్మద్ పై భక్తి భావాన్ని చాటేలా నాత్ పాటలు ఆలపించారు. ర్యాలీ అనంతరం దర్గా మెట్ల వద్ద దాదాపు 300 మందికి పైగా పేదలకు అన్నదాన చేశారు. ఈ కార్యక్రమంలో మిలాద్ జూలూస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఆబేద్, అడ్వైజర్ ఎండీ కలీమ్ ఖాన్ (జర్నలిస్ట్), మిలాద్ కమిటీ ప్రెసిడెంట్ మసి ఉద్దీన్ (అడ్వకేట్), సెక్రటరీ అబిద్, సీపీఎం పార్టీ సీనియర్ నేత హాశం, సలీం, పీస్ కమిటీ సభ్యులు, ఎంఐఎం సీనియర్ నాయకులు ఖాజా గౌస్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. అలాగే విద్యార్థి సంఘం నాయకులు కట్టెల శివ, బీఆర్ఎస్ నాయకులు జమాల్ ఖాద్రి, సీపీఎం నాయకులు దండంపళ్లి సత్తయ్య, కమిటీ సభ్యులు సుపియన్ ఖాద్రి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.

నల్లగొండలో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు