చౌటుప్పల్, డిసెంబర్ 20 : చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆధార్ నమోదు కేంద్రాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 6 నెలల నుంచి ఈ పరిస్థితి దాపురించింది. స్థానిక మీసేవ, ఎస్బీహెచ్ బ్యాంక్, ఫోస్టాఫీసుల్లో ఆధార్ సెంటర్లు నడిచేవి. వాటిలో నమోదు పక్రియలో కొన్ని పొరపాట్లు దొర్లడం మూలంగా ఆపరేటర్లను తొలగించారు. వారి స్థానంలో తిరిగి కొత్తవారిని నియమించాల్సి ఉన్నా అందుకోసం జిల్లా ఆధార్ కేంద్రం యూఐడీ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో ఈ సమస్య వెంటాడుతున్నది.
మండల వాసులు కొత్త ఆధార్ కార్డుకు దరఖాస్తు, చేర్పులు, మార్పులు చేసుకోవడానికి సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, చిట్యాల, భూదాన్ పోచంపల్లి తదితర మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. అక్కడకు వెళ్లినా పనులు త్వరితగతిన కావడం లేదు. పొద్దస్తమానం ఎదురు చూడాల్సి వస్తున్నది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాల నేపథ్యంలో ముందు చూపుగా ప్రతి కేంద్రంలో ప్రజలు బారులు తీరుతున్నారు. దాంతో ఈ మండల వాసులు దూర ప్రాంతాలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని మూతపడిన ఆధార్ కేంద్రాలను తెరిపించాలని పలువురు కోరుతున్నారు.
నాకు ఇద్దరు కూతుళ్లు. రేషన్కార్డు లింక్ కోసం రేషన్ షాపునకు వెళ్లాను. అక్కడ పిల్లల వేలి ముద్రలు పడకపోవడంతో ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. చౌటుప్పల్ సెంటర్కు వెళ్లితే మూతపడి ఉన్నాయి. పిల్లల స్కూల్ బంద్ చేసుకొని దూర ప్రాంతాలకు వెళ్లలేక పోతున్నా. వెంటనే మూతపడిన ఆధార్ కేంద్రాలను తెరిపించాలి.
-బొమ్మకంటి నరేశ్, లక్కారం
నా ఏడాదిన్నర కూతురు ఆధార్ కార్డు నమోదు కోసం సంస్థాన్ నారాయణపురం వెళ్లిన. అక్కడ నమోదు చేపించేందుకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటలకు వేచి ఉన్నా. చిన్న పాపతో వేచి ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. పైగా నా పని మానుకోని పోవాల్సి వచ్చింది. అదే మా దగ్గర ఉంటే ఇలాంటి ఇబ్బంది తప్పేది. తక్షణమే ఆధార్ కేంద్రాలను తిరిగి ఏర్పాటు చేయాలి.
-చింతకింది శ్రీనివాస్ గౌడ్, చౌటుప్పల్