నల్లగొండ ప్రతినిధి, మార్చి16(నమస్తే తెలంగాణ) : భారత జాగృతి సంస్థ కన్వీనర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం సాయంత్రం కవిత అరెస్టు విషయం తెలిసిన వెంటనే పలుచోట్ల బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చారు. శనివారం ఉమ్మడి జిల్లా అంతటా ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించారు. నల్లజెండాలు, నల్ల కండువాల, బ్యాడ్జీలతో ర్యాలీలు తీసి రోడ్లపై బైఠాయించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరితంగా అక్రమ అరెస్ట్కు పాల్పడిందంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో నల్లజెండాలతో ర్యాలీగా క్లాక్టవర్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడే ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేవరకొండలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్కు ఎదురుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే కవితను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో కొనసాగించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రవీంద్రకుమార్సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ట్రైకార్ సంస్థ మాజీ చైర్మన్ రాంచందర్నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీగా ప్రధాన కూడలికి చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. నందికొండలో గులాబీ నేతలు రాస్తారోకో చేశారు.
మిర్యాలగూడలోని ప్రధాన కూడలిలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. నల్లకండువాలు, బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశాయి. మోడీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, కవితను విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని జగ్జీవన్రావ్ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ నేత సూదగాని హరిశంకర్గౌడ్ నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి కవిత అక్రమ అరెస్టును ఖండించాలని నినాదాలు చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సూర్యాపేటలోనూ తెలంగాణ తల్లి చౌరస్తాలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగాయి. కవిత అరెస్టును ఖండిస్తూ నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ కవితను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూర్(ఎస్), చివ్వెంల మండలాల్లోనూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్స్లో పార్టీ నేతలు, శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. మునగాలలో హైవేపై రాస్తారోకో చేపట్టారు. హుజూర్నగర్లోని ఇందిరాచౌరస్తాలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కవిత అరెస్టుపై నిరసన వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు.
తిరుమలగిరిలో రాస్తారోకో, మోత్కూరులో ధర్నా, నూతనకల్, నాగారం తదితర మండల కేంద్రాల్లోనూ నిరసనలు కొనసాగాయి. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనల్లో పాల్గొన్నాయి. ఉమ్మడి జిల్లా అంతటా కవిత అరెస్టు అక్రమం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల ముందు అరెస్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను కేసులు, అరెస్టులతో భయపెట్టలేరని హెచ్చరించారు. కవితను భేషరతుగా విడుదల చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.