బొడ్రాయిబజార్, ఏప్రిల్ 17 : ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. నల్లగొండ జిల్లాలో బుధవారం 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిడమనూరులో గరిష్ఠంగా 44.8 డిగ్రీలు, నాంపల్లిలో 44.7, దామరచర్లలో 44.6, మునుగోడులో 44.5, అనుములలో 44.4, తిరుమలగిరి సాగర్, మాడ్గులపల్లిలో 44.3, మిర్యాలగూడ, చందంపేటలో 44, అత్యల్పంగా చింతపల్లిలో 39 డిగ్రీలు రికార్డయ్యాయి. ఏడు మండలాల్లో 44 డిగ్రీలకుపైగా, 12 మండలాల్లో 43 డిగ్రీలు, తొమ్మిది మండలాల్లో 42 డిగ్రీలు, మిగిలిన మండలాల్లో 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సూర్యాపేట జిల్లాలోనూ 44 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం మునగాలలో అత్యధికంగా 44.7 డిగ్రీలు, సూర్యాపేటలో 42 డిగ్రీలు రికార్డయ్యింది. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఎండ వేడిమికి తాళలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుండే ఎండ ప్రభావం కనిపిస్తుండడంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 33 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాన్, కూలర్లు లేకుండా ఇండ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. వడగాలులతో ప్రజలు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లడం లేదు. దాంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.