నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 20 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన 18 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,140 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 5,737 మంది హాజరయ్యారు. 394 మంది గైరాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9 మంది డీబార్ కాగా దేవరకొండ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సూర్యాపేట రాకేవ్ బీఈడీ కళాశాలలో ముగ్గురు, తిరుమలగిరిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో ఒకరు, దేవరకొండ భారతి డిగ్రీ కళాశాలలో ఒకరు, మిర్యాలగూడోలని హాసితి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఒకరు, నల్లగొండలోని డీవీఎం కళాశాలలో ఒకరు చొప్పున డీబార్ అయ్యారు.
అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఒకటో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలో 9 మంది డీబార్ అయ్యారు. ఈ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,151 మంది హాజరయ్యారు. 391 మంది గైరాజరయ్యారు. నల్లగొండ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఒకరు, సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సూర్యాపేట ఆర్కేఎల్కే కళాశాలలో ఒకరు, భువనగిరి లోని ఎస్ఎల్ఎన్ కళాశాలలో ఒకరు, భువనగిరి స్టాన్ఫర్డ్ ఉమెన్స్ కళాశాలలో ఒకరు, మిర్యాలగూడ హాసితా కళాశాలలో ఒకరు డీబార్ అయినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్రెడ్డి వెల్లడించారు.