రెండో రోజు విస్తృతంగా రక్తదాన శిబిరాలు
సూర్యాపేట, నకిరేకల్లో ప్రారంభించిన మంత్రి జగదీశ్రెడ్డి
నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహణ
పెద్దసంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు
నేడు మొక్కలు నాటేందుకు సన్నద్ధం సర్వమత ప్రార్థ్ధనలకు ఏర్పాట్లు
దేశానికి కొత్త అభివృద్ది నమూనా కేసీఆర్ : మంత్రి జగదీశ్రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి16(నమస్తే తెలంగాణ);తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లావ్యాప్తంగా పండుగలా జరుగుతున్నాయి. తొలిరోజు అన్నదానాలతో వేడుకలకు శ్రీకారం చుట్టిన గులాబీ శ్రేణులు రెండో రోజైన బుధవారం ఆపదల్లో ఉన్న రోగుల కోసం విస్తృతంగా రక్తదానం చేశాయి. సూర్యాపేట, నకిరేకల్లో రక్తదాన శిబిరాలను మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శిబిరాలు కొనసాగగా.. ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు భాగస్వాములయ్యారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు యావత్ జిల్లా సమాయత్తమవుతున్నది. ప్రార్థనా మందిరాల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతోపాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. –
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని మూడ్రోజుల సంబురాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నేత బర్త్డే కానుకగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. వృద్ధులు, అనాథాశ్రమాల్లో అన్నదానం చేయడంతో పాటు దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
రక్తదానం మహాదానం ;తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్
రక్తదానం మహాదానమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సూర్యాపేట జనరల్ దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు 100 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుజ్జ యుగంధర్రావు, మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పాల్గొన్నారు.
తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా అంతటా ప్రజల పండుగలా జరుగుతున్నాయి. తొలిరోజు అన్నదానాలు, ఇతర వితరణలకు శ్రీకారం చుట్టి రెండో రోజు ఆపదల్లో ఉన్న రోగుల కోసం విస్తృతంగా రక్తదానాలు చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు కొనసాగగా ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు భాగస్వాములయ్యారు. నకిరేకల్, సూర్యాపేటల్లో రక్తదాన శిబిరాలను మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించగా నల్లగొండ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్కుమార్ స్వయంగా రక్తదానం చేసి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. ఇక గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యావత్తు సమాయత్తమైంది. జిల్లాలోని అన్ని ప్రార్ధనా మందిరాల్లో ఎక్కడికక్కడే సర్వమత ప్రార్ధనలు నిర్వహించడంతోపాటు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. దేశానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అభివృద్ధి నమూనాగా నిలిచారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
సూర్యాపేటలో….
సూర్యాపేటలోని మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయం ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి మంత్రి రక్తదానాన్ని ప్రారంభించారు. పట్టణానికి సంబంధించిన యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములయ్యారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నేతృత్వంలో తిరుమలగిరిలోని ఎమ్మెల్యే నివాసం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ శ్రేణులు, యువత రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములయ్యారు.
హుజూర్నగర్లో..
నేరేడుచర్లలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం హుజూర్నగర్లోని పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కోదాడ నియోజకవర్గంలోని మునగాలలో పేద మెడిసిన్ విద్యార్థ్ధిని ఎల్.కీర్తికి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ రూ.12వేల ఆర్థిక సాయం అందజేశారు.