హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, చార్మినార్, సుల్తాన్ బజార్, మే 23 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్.. ప్రస్తుతం కరోనా రోగులను హడలెత్తిస్తున్న ఈ వ్యాధి సోకటానికి ప్రధాన కార ణం ఏమిటి? కొవిడ్ రోగులు స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్లనే బ్లాక్ ఫంగస్ వస్తున్నదని కొద్దిరోజులుగా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులకు చాలాకాలంగా స్టెరాయిడ్స్ వాడుతున్నా కనిపించని ఈ వ్యాధి, వారం పది రోజులు స్టెరాయిడ్స్ వాడిన కొవిడ్ రోగులకే ఎందుకు వస్తున్నదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్ఫంగస్ వ్యాధి ఎంతోకాలంగా ఉన్నది. గతంలో ఏడాదికి ఒకటిరెండు కేసులు మాత్రమే నమోదయ్యేవి. కరోనా రెండో వేవ్లో మాత్రం ఇబ్బడిముబ్బడిగా కేసులు వెలుగుచూస్తున్నాయి.
స్టెరాయిడ్స్ వాడకం వల్లనే బ్లాక్ ఫంగస్ వస్తున్నదన్న వాదనతో విభేదిస్తున్న వైద్యులు తాజాగా ఐరన్, జింక్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కొవిడ్ రోగుల్లో ప్రధానంగా రక్తంలో జింక్, ఐరన్ మోతాదులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఐరన్, జింక్ మాత్రల వాడకం ఇందుకు కారణం కాగా, శరీరంలో కరోనా చూపే దుష్ఫ్రభావంతో రక్తంలో ఈ రెండింటి మోతాదు పెరుగుతుందని అంటున్నారు. ఐరన్, జింక్ ఎక్కువగా ఉండటమంటే ఫంగస్ పేరుకుపోయేందుకు అనుకూల పరిస్థితులు కల్పించడమేనని చెప్తున్నారు. ఫంగస్ ప్రధాన ఆహారం ఐరన్, జింక్ అయినందున వెంటనే అది వృద్ధి చెందుతున్నదని అంటున్నారు. ఈ కారణంగానే కొవిడ్ రోగులు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని అంచనా వేస్తున్నారు.
చిన్నారుల్ల్లో బ్లాక్ఫంగస్ ప్రభావం తక్కువేనని కింగ్కోఠి దవాఖాన జనరల్ ఫిజీషియన్, ఎండీ డాక్టర్ మజారుల్లా తెలిపారు. చిన్నారుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి శాతం తక్కువ స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. బ్లాక్ ఫంగస్ సోకినవారికి తీవ్ర జ్వరం, విరేచనాలు కలుగుతాయని, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. మొదట్లోనే దీన్ని గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని చెప్పారు. ప్రస్తుతానికి బ్లాక్ఫంగస్ వ్యాధి నివారణలో రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధిస్తున్నదని పేర్కొన్నారు. మధుమేహం, హెచ్ఐవీ, క్యాన్సర్ రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కోఠి ఈఎన్టీ దవాఖానలోని బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంలో 260 మంది రోగులు ఇన్పేషెంట్లుగా చికిత్సలు పొందుతున్నారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తాటి శంకర్ తెలిపారు. ఆదివారం దవాఖానాకు బ్లాక్ ఫంగస్ ఔట్ పేషెంట్లుగా 80 మంది వచ్చారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి 60 మందికి అడ్మిషన్ ఇచ్చామని చెప్పారు. వీరితోకలిపి దవాఖానాలో ఇన్పేషెంట్ల సంఖ్య 260కు చేరిందని వెల్లడించారు.
సరైన అధ్యయనం జరగాలి..
కొవిడ్ రోగులు స్టెరాయిడ్స్ వాడటంతో బ్లాక్ ఫంగ స్ వస్తుందంటున్నారు. రుమటాలజీ, కిడ్నీ, నరాల సంబంధ వ్యాధులు, ఆస్తమా, అలర్జీ ఉన్నవారు కూడా దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. వారు బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న దాఖలాలు లేవు. బాధితుల్లో 99% మధుమేహ వ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. ఈ కోణంలోనూ పరిశీలన జరగాలి. – డాక్టర్ సునీల్ బొనెల, సీనియర్ రేడియాలజిస్టు, ఆలివ్ దవాఖాన
అపరిశుభ్ర మాస్కుతో కూడా..
స్టెరాయిడ్స్తోనే బ్లాక్ ఫంగస్ వస్తున్నదనే వాదనపై సందేహాలున్నది వాస్తవమే. దీనిపై కచ్చితమైన అధ్యయనం జరిగి కారణాలు వెల్లడి కావాలి. ఫంగస్ అం టే సాధారణంగా మన చుట్టూ పేరుకుపోయే బూజులాంటిదే. కొవిడ్ రోగులు మాస్కును సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అందులోని దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి.. ఫంగస్గా ఫామ్ అయ్యే అవకాశాలుంటాయి. – డాక్టర్ పరంజ్యోతి, నిమ్స్ పల్మనాలజిస్టు
ఆక్సిజన్ వినియోగమే కారణం కావచ్చు..
బ్లాక్ ఫంగస్కు ప్రధాన కారణం స్టెరాయిడ్స్ అనే వాదన శాస్త్రీయంగా రుజువు కాలేదు. కాకపోతే అది ఒక కారణం కావచ్చని అంచనా. కరోనా రెండో వేవ్లోనే మాత్రమే ఆక్సిజన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఆక్సిజన్లో లోపాలు లేదా స్వచ్ఛత లేమీ బ్లాక్ ఫంగస్ సోకటానికి కారణం కావచ్చు. – డాక్టర్ హమీద్, అసోసియేట్ ప్రొఫెసర్, ఈఎన్టీ దవాఖాన