సూర్యాపేట టౌన్, మార్చి 6: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను సమర్థించినట్టేనని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. బీజేపీ పాలనలో ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని.. ఆదుకుంటాడనుకున్న మోదీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడని మంత్రి మండిపడ్డారు. నల్లగొండ-వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సూర్యాపేటలో నిర్వహించిన పెన్షనర్ల ఆత్మీయ సమావేశం, ఇతర సంఘాల సమావేశాలకు హాజరయ్యారు. ఆదానీ, అంబానీల ఆస్తులు పెంచేందుకే ప్రధాని మోదీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నదని జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు బీజేపీ చెప్పినట్టు.. నల్లధనం వెనక్కి తెచ్చిండా?.. పేదల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు వేసిండా?’ అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని స్పష్టం చేశారు. వినూత్న కార్యక్రమాలతో తెలంగాణ నిజమైన సంక్షేమ రాజ్యంగా మారిందని చెప్పారు. పీఆర్సీ ఉద్యోగుల హక్కని.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలన్నది ప్రభుత్వ అభిమతం కాదని మంత్రి స్పష్టం చేశారు. గత ఆరేండ్లు ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారధిగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరోమారు పట్టం కట్టాలని కోరారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రావు, ప్రధాన కార్యదర్శి సుదర్శన్రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు కొల్లేటి రవీందర్రెడ్డి, డివిజన్ కార్యదర్శి దండ శ్యాంసుందర్రెడ్డి పాల్గొన్నారు.