ఈ రోజుల్లో ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వరకు బాగానే వస్తాయి కలెక్షన్లు. కానీ ఆ తర్వాత సోమవారం వచ్చిందంటే దాని భవిష్యత్తు ఏంటో తేలిపోతుంది. అందుకే ఇండస్ట్రీలో విడుదలైన తర్వాత వచ్చే తొలి సోమవారాన్ని మండే టెస్ట్ అని పిలుస్తారు. ఆ రోజు కానీ సినిమా నిలబడింది అంటే ఇక దానికి తిరుగు లేనట్లే. ఈ వారం విడుదలైన జాతిరత్నాలు సినిమా ఈ టెస్ట్ పాస్ అయింది. నాలుగు రోజుల వీకెండ్ అద్భుతంగా యూజ్ చేసుకున్నారు జాతి రత్నాలు. ఈ సినిమా 4 రోజుల్లోనే రూ.34 కోట్ల గ్రాస్ రూ.21 కోట్ల షేర్ వసూలు చేసింది.
కేవలం మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించారు జాతి రత్నాలు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ తెరకెక్కించిన ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. దాంతో సోమవారం రోజు కూడా మంచి వసూళ్లు వచ్చాయి. ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.7 కోట్ల షేర్ వసూలు చేసింది జాతి రత్నాలు. దాంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు సంతోషంలో మునిగిపోయారు.
ఈ సినిమాకు పోటీగా విడుదలైన శ్రీకారం, గాలి సంపత్ రెండు నిరాశ పరిచాయి. శర్వానంద్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా జాతి రత్నాలు దెబ్బకు నిలబడలేకపోయింది. దాంతో జాతి రత్నాలు సోలోగా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తున్నారు. ఏ సినిమా జోరు చూస్తుంటే సెకండ్ వీకెండ్ కూడా హవా కనిపించడం ఖాయం. ఫుల్ రన్లో రూ.30 కోట్ల షేర్ వసూలు చేయడం పక్కా అయిపోయింది. ఇదేగాని జరిగితే రూ.12 కోట్ల లక్ష్యంతో వచ్చిన జాగ్రత్తలు డిస్ట్రిబ్యూటర్లకు రూ.18 కోట్ల లాభాలు తీసుకువచ్చినట్లు అవుతుంది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా జాతి రత్నాలు వీక్ కావడం లేదు.