మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 25 : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దోమలు, ఈగల వల్ల వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెంది, సీజనల్ వ్యాధులైన టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫైలేరియా, మెదడువాపు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈగలు, దోమలను అరికట్టగలిగితే సీజనల్ వ్యాధులను అడ్డుకోవచ్చన్నారు. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు పారిశుధ్య కార్మికులు, వైద్య, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి, ఇంటి పరిసరాలను పరిశీలించాలన్నారు.ప్రధానంగా నీటి తొట్టీలు, టైర్లల్లో మురికి నీరు ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ అధికారులు ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్లాలన్నారు.మురికి నీటి గుంటలు ఉంటే గంబుషియా చేపలు వదలాలన్నారు. ప్రతి మండలంలో 10 వేల ఆయిల్ బాల్స్ వేయాలని, ప్రతి రోజు ఫాగింగ్ చేయాలని డీపీవో రమణమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు నరసింహారెడ్డి, జాన్ శ్యాంసన్, జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు, డీపీవో రమణమూర్తి, డీఈవో ప్రసాద్, పీఈడీటీఎస్, డీడబ్ల్యూవో, బీసీ సంక్షేమ అధికారి ఝాన్సీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.