సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 27 : నేటినుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని, దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏండ్ల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదివారం 1137 పోలియో బూత్ల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలియో చుక్కలు వేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి తొలిరోజు మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు సిబ్బంది వేస్తారని చెప్పారు.
జిల్లాలోని 1,80,405 మంది 0-5 ఏండ్ల వయస్సు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1583 మంది ఏఎన్ఎంలు, 904 మంది ఆశ కార్యకర్తలు, 1505 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 625 మంది ఇతర వలంటీర్లు, ఆరుగురు ప్రోగ్రాం అధికారులు పాల్గొంటారని తెలిపారు. వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లో నివసించే చిన్నారులపై ప్రత్యేక దృష్టిసారించి, వారికి కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గతంలో పల్స్ పోలియో చుక్కలు వేయించనప్పటికీ మరోసారి వేయించడం ద్వారా చిన్నారులకు పూర్తి రక్షణ లభిస్తుందని తెలిపారు.