అమెరికాలో ఉంటూ గొప్ప వ్యాపారాలు చేస్తున్నా ఆ వ్యక్తికి సొంతూరిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. సొంతూరుకు ఏదైనా చేయాలన్న తపన అతన్ని గొప్ప కార్యానికి పురికొల్పింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన కేశిరెడ్డి ప్రవీణ్రెడ్డి అమెరికాలో బిజినెస్ చేస్తున్నారు. కొన్నేండ్లుగా అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్న ఆయన, సొంతూరికి ఏదైనా చేయాలని తలంచి వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన పురాతన శివాలయ పునర్నిర్మానికి ముందుకు వచ్చాడు.
గజ్వేల్/జగదేవ్పూర్, ఫిబ్రవరి 9: ఎన్ఆర్ఐ కేశిరెడ్డి ప్రవీణ్రెడ్డి సహకారంతో పీర్లపల్లి గ్రామంలోని పురాతన శివాలయ కొత్తశోభను సంతరించుకుంది. ఈ గుడిని అద్భుతంగా పునర్నిర్మిస్తున్నారు. పాతరాతి కట్టడాన్ని ధ్వంసం చేయకుండా గర్భగుడిలో గ్రానైట్తో, బయట కాంక్రీట్తో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని విస్తరిస్తూ ఆలయం ముందు మండపాన్ని అద్భుతంగా నిర్మించారు. ఎకరం విస్తీర్ణంలో రూ.65లక్షలకు పైగా ఖర్చు చేసి ఆలయం నిర్మాణం పూర్తి చేయడంతో పాటు పురాతన శివాలయం, నూతనంగా శివపంచాయతన విగ్రహాలను ప్రతిష్ఠించడానికి సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్ఠాపన కోసం నవగ్రహాల విగ్రహాలను సిద్ధం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు అహ్లాదాన్ని పంచే విధంగా సర్పంచ్ యాదవరెడ్డి ఆధ్వర్యంలో పార్కు, విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ఆలయానికి ప్రత్యేకంగా రాతి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
నేటినుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు…
పీర్లపల్లిలో పునర్నిర్మించిన శివాలయంలో శుక్రవారం నుంచి శివపంచాయతన, ధ్వజస్తంభ, నవగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. శుక్రవారం గణపతి, గురుపూజ, అంకురారోహణం, రుత్విక్వరణం, అఖండ దీపస్థాపన, మంటప దేవతాస్థాపనం, కలశస్థాపన, ప్రతిమశోధనం, సాయంత్రం యాగశాల ప్రవేశం, కుండ సంస్కారం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హవనం, కుండసంస్కారం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హవనం, జలాధివాసం, ప్రదోషపూజ తదితర కార్యక్రమాలు ఉంటాయి. శనివారం గణపతిపూజ, హవనం, మంటపపూజ, సామూహిక అభిషేకాలు, ధాన్యాధివాసం, సాయంత్రం మూలమంత్ర హవనం, శయ్య, పుష్ప, ఫలాధివాసం, రాజోపచార సేవలు నిర్వహిస్తారు. ఆదివారం గణపతిపూజ, స్థాపిత దేవతాపూజ, పూర్ణాహుతి, విగ్రహప్రతిష్ఠ, బలిహరణం, కలశ ఉద్వాసన, విశేషపూజ, శివపార్వతుల కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆలయాభివృద్ధికి అవకాశం రావడం నా అదృష్టం
సొంతూరికి ఏదైనా చేయాలని ఎప్పటి నుంచో మనసులో ఉంది.గ్రామంలోని పురాతన శివాలయ అభివృద్ధి చేసే అవకాశం నాకు లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో గ్రామానికి మరిన్ని సేవలందించడానికి ముందుంటా. సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలకు
కృతజ్ఞతలు.
– కేశిరెడ్డి ప్రవీణ్రెడ్డి, ఎన్ఆర్ఐ
స్ఫూర్తిని నింపింది
శివాలయ అభివృద్ధితో గ్రామంలో ఆధ్యాత్మికత సంతరించుకున్నది. పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మంచింది. ఆలయాభివృద్థి గ్రామస్తులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. గ్రామానికి ఏదైనా చేయాలన్న స్ఫూర్తిని యువతలో నింపింది. ఆలయ నిర్మాణంలో నావంతుగా మండపానికి గ్రిల్స్ను ఏర్పాటు చేయించా.
– కేశిరెడ్డి రవీందర్రెడ్డి, స్థానిక నాయకుడు
గ్రామానికి కొత్తకళ
పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడంతో గ్రామానికి కొత్తకళ వచ్చింది. ఆలయం చాలా పాతది కావడంతో అమెరికాలో ఉంటున్న ప్రవీణ్రెడ్డి అభివృద్ధి చేయాలని ముందుకు రావడం అభినందనీయం. ఆలయాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. నావంతు సహకారంగా ఆలయ విస్తరణ కోసం స్థలం సేకరించడంతో పాటు ధ్వజస్తంభాన్ని తయారు చేయించాను. ఆలయాభివృద్ధిలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది.
– అంకెల యాదవరెడ్డి, సర్పంచ్, పీర్లపల్లి