సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ల చిచ్చు రాజుకుంది. పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ను కాటా శ్రీనివాస్గౌడ్కి కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధుకు అధిష్టానం కేటాయించింది. నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ కోసం సంజీవరెడ్డి, సురేశ్షెట్కార్ పోటీపడ్డారు. సంజీవరెడ్డిని పక్కనబెట్టి సురేశ్ షెట్కార్కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. పటాన్చెరు, నారాయణఖేడ్ టికెట్లు అమ్ముకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కాటా శ్రీనివాస్గౌడ్, సంజీవరెడ్డి అనుచరులు మంగళవారం నిరసనలకు దిగారు. రేవంత్రెడ్డి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారంటూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పటాన్చెరు నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ను రూ.100 కోట్లకు రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి అమ్ముకున్నారంటూ సోమవారం రాత్రి రామచంద్రాపురంలోని బీరంగూడ కమాన్ వద్ద, మంగళవారం గాంధీభవన్ ఎదుట, హైదరాబాద్లోని రేవంత్రెడ్డి నివాసం ఎదుట ధర్నా చేశారు. కాటా శ్రీనివాస్గౌడ్ భార్య సుధారాణి కాంగ్రెస్ అధిష్టానం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలపై మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పటాన్చెరు టికెట్ కాటా శ్రీనివాస్గౌడ్కు ఇవ్వకుండా కుట్రపూరితంగా అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహ, మరో సీనియర్ నేత జగ్గారెడ్డి మధ్య గొడవకు దారితీసింది.
పటాన్చెరు, నవంబర్ 7: కాంగ్రెస్లో అర్ధరాత్రి టికెట్ చిచ్చు చెలరేగింది. పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశీంచిన కాట శ్రీనివాస్గౌడ్ను కాదని ఈ మధ్యే పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్కు పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంపై పెద్దఎత్తున నిరసన జ్వాలలు రాజేశాయి. మొదటి రెండు లిస్టుల్లో పటాన్చెరు టికెట్ ప్రకటించని కాంగ్రెస్ అధిష్టానం, సోమవారం రాత్రి నీలం మధు ముదిరాజ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. టికెట్పై ఆశలు పెట్టుకున్న కాట శ్రీనివాస్గౌడ్ వర్గంలో తీవ్రస్థాయిలో అగ్రహావేశాలు చెలరేగాయి. టికెట్ రాలేదన్న కోపంతో అర్ధరాత్రి బీరంగూడ చౌరస్తాలో జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం పీసీసీ రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ డౌన్డౌన్, రేవంత్రెడ్డి డౌన్డౌన్ అంటూ నినదించారు. రేవంత్రెడ్డి పోస్టర్లను, ఫ్లెక్సీలను చింపి మంటల్లో తగులబెట్టారు. కాట మద్దతుదారులు వందలాదిమంది తీవ్ర ఆగ్రహంతో జాతీయ రహదారిపై వాహనాలపైన కూడా దాడులకు పాల్పడ్డారు. ఆర్సీపురం పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అక్కడి నుంచి పంపించివేశారు.
– కాట సుధారాణి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భట్టివిక్రమార్కలు డబ్బులకు అమ్ముడుపోయారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాట సుధారాణి ఆరోపించారు. టికెట్ ఇస్తామని నమ్మించి గొంతుకోశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చచ్చిపోతే తొమ్మిదేండ్లు జెండా మోసిన తమనే మోసగించడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులను రేవంత్రెడ్డి మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులంతా కలిసివచ్చి రేవంత్రెడ్డి అక్రమాలను ఎండగడదామని పిలుపునిచ్చారు.
నగరంలోని గాంధీభవన్, రేవంత్రెడ్డి నివాసాల ఎదుట కాంగ్రెస్ నాయకులు కాట శ్రీనివాస్గౌడ్ అనుచరులు తీవ్ర నిరసనలు చేపట్టారు. వందలాదిమంది నేరుగా రేవంత్రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. మరోపక్క టికెట్ రాలేదనే ఆక్రోశంలో కాంగ్రెస్ శ్రేణులు నాంపల్లిలోని గాంధీభవన్ ముందు విధ్వంసం సృష్టించారు. టైర్లను కాల్చి బీభత్సం చేశారు. నాంపల్లి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. రామచంద్రాపురం, పటాన్చెరు, జిన్నారం మండలాల్లోనూ కాటకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పుడు రెండుగా చీలడం స్పష్టంగా కనిపిస్తున్నది.
రామచంద్రాపురం, నవంబర్ 7: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకుంటూ పార్టీ కోసం కష్టపడిన వారిని మోసం చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాట సుధాశ్రీనివాస్గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అర్ధరాత్రి ఆర్సీపురం, బీరంగూడకమాన్, జ్యోతినగర్లో జాతీయ రహదారిపైన టైర్లను, టీపీసీసీ రేవంత్రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోస్టర్లను దహనం చేశారు. ఈ నేపథ్యంలో కాట సుధాశ్రీనివాస్గౌడ్ హైకమాండ్ తీరుపై తన మనోగతాన్ని ఓ వీడియో రూపంలో సోషల్మీడియాలో పెట్టారు. రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి ఇద్దరు కలిసి పటాన్చెరు టికెట్ని అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో సచ్చిపోతే పార్టీని కాట శ్రీనివాస్గౌడ్ పైకి తీసుకువచ్చారన్నారు. 2018 ఎన్నికల్లో పదిరోజుల వ్యవధిలోనే నియోజకవర్గంలో కాట శ్రీనివాస్గౌడ్కు సుమారుగా 80వేల ఓట్లు వచ్చాయని, అప్పటినుంచి ఆయనతో పాటు తాను ప్రజలకు, క్యాడర్కు సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీ హైకమాండ్ ఏ పిలుపు ఇచ్చిన దానిని నియోజకవర్గంలో విజయవంతం చేశామన్నారు. బలమైన క్యాడర్ని ఏర్పాటు చేసుకొని జనంలో ఉన్న కాట శ్రీనివాస్గౌడ్ని పక్కనబెట్టి పది రోజుల ముందు పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ని ఎవరెన్ని డబ్బులకు అమ్ముకున్నారో ఆధారాలతో భయటపెడుతామన్నారు.