పటాన్చెరు, జూలై 13 : విపత్తుల నివారణకు ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పా టు చేశామని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం పటాన్చెరు నియోజకవర్గం స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల నివారణకు ఏర్పాటు చేసిన కమిటీలోని అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్నిశాఖల అధికారుల ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని సూచించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తే ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. చెరువులు, కుం టలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
నీటి పారుదల లైన్లను తక్షణం క్లియర్ చేసుకోవాలన్నారు. పాత, శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించాలని, అందులో నివస్తున్న వారిని తరలించాలని సూచించారు. ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించాలని చెప్పారు. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రమాదం ఉన్న చోట హెచ్చరికలు జారీ చేయాలన్నారు. మండలాలు, గ్రామాల్లోనూ కమిటీలుగా ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకోవాలన్నారు. జిల్లాలో భారీ వర్షాలున్నందుకు జడ్పీ సమావేశాన్ని రద్దు చేశామన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పరిశుభ్రతను పర్యవేక్షించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం కోసం మొక్కలు నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో నగేశ్, తహసీల్దార్లు మహిపాల్రెడ్డి, విజయ్కుమార్, శివ, దశరథ్, మున్సిపల్ కమిషనర్లు బాలయ్య, సుజాత, కరణ్, పటాన్చె రు ఎంపీడీవో బన్సీలాల్, మల్లేశ్వర్ పాల్గొన్నారు.