వాళ్లంతా పేదలు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో రెక్కలు ముక్కలు చేసుకుని పంటలు పండించి బతికేవారు. వారి భూములపై ఓపెద్ద నేత గద్దల్లా వాలాడు. తనకు చెందిన జమునా హేచరీస్ కోసం ఆ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుని కబ్జాలకు పాల్పడ్డాడు. గతేడాది ఈ భూకబ్జా వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయబద్ధంగా వ్యవహరించి బాధిత రైతులకు తిరిగి ఆ భూములను అప్పగించింది. బీజేపీ నేత ఈటల రాజేందర్ ద్వారా నష్టపోయిన బాధితులకు బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. వెల్దుర్తి మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన 65 మంది బాధితులకు 85.19 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించిన పట్టాలను అందజేశారు. దీంతో సీఎం కేసీఆర్ మా దేవుడంటూ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు సీఎం కేసీఆర్ జిందాబాద్.. టీఆర్ఎస్ ప్రభుత్వ యాంలోనే మాకు న్యాయం జరిగిందని.. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని నినాదాలు చేశారు.
– మెదక్, జూన్ 29 (నమస్తే తెలంగాణ)/వెల్దుర్తి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం గతేడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ మెదక్ జిల్లాలో అసైన్డ్ భూముల్లో పాగా వేసి భార్య పేరున జమునా హేచరీస్ నెలకొల్పి పౌల్ట్రీ బిజినెస్ చేస్తున్నారు. అసైన్డ్ భూములని తెలిసినా ఈటల రాజేందర్ రైతుల హక్కు పత్రాలను సైతం లాగేసుకొని తానే అందులో పాగా వేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు రైతులపై లాఠీచార్జి చేయించిన ఘనత ఆయనది. ఈటల భూముల కబ్జాల వ్యవహారం గతేడాది సంచలనం రేపగా, ఈటల ద్వారా నష్టపోయిన బాధితులకు బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 77, 78, 79,80,81,82, 130, హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్లు 97, 111లోని బలహీన వర్గాలకు చెందిన 70.33 ఎకరాల సీలింగ్, అసైన్డ్ భూములను జమునా హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ అసైన్డ్ భూములు (బదిలీ నిషేధం) చట్టం 1977లోని నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఆక్రమించింది. అంతేకాకుండా అచ్చంపేట గ్రామంలోని 77, 78, 79, 80, 82, 130, హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 97లోని అసైన్డ్, సీలింగ్ భూముల్లో రోడ్లు వేసి, బాధిత రైతులను వారి భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది. ఇందులో బీసీలు 53 మంది, ఎస్టీలు 3, ఎస్సీలు 9 మందికి చెందిన భూములు జమునా హేచరీస్ అక్రమంగా ఆక్రమించుకున్నది. జమునా హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ వ్యవసాయ చట్టం కింద 2006 ప్రకారం వ్యవసాయేతర భూమార్పిడి అనుమతులు పొందకుండా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులోని సర్వేనంబర్ 78, 81, 130లలో భారీ పౌల్ట్రీ షెడ్లు, ఫ్లాట్పామ్లు, రోడ్లు, ఇతర షెడ్లను నిర్మించారు. అంతేకాకుండా అచ్చంపేట గ్రామ శివారులోని సర్వే నంబర్లో 81లో 5 ఎకరాలు, సర్వేనంబర్ 130లో 3 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, జమునా హేచరీస్ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంది. జమునా హేచరీస్ అక్రమంగా కబ్జాచేసిన అసైన్డ్ భూములు 70.33 ఎకరాలు కాగా, రెవెన్యూ అధికారుల సర్వేలో మరో 15 ఎకరాలు అసైన్డ్ భూమి ఉన్నట్టు గుర్తించారు. దీంతో నిరుపేదలైన అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన 65 మంది బాధితులకు 85.19 ఎకరాల అసైన్డ్ భూమికి సంబంధించిన పట్టాలను అధికారులు అందజేశారు.
ఎన్నో ఏండ్లుగా మా భూములను ఈటల రాజేందర్కు చెందిన జమునా హేచరీస్ వారు కబ్జా చేశారని, ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన నిరుపేద రైతులు భూమగారి శేషమ్మ, కొయ్యల నర్సమ్మ, భారతమ్మ, చాకలి రాజమణి, కొయ్యల రవీందర్గౌడ్ తెలిపారు. 20ఏండ్లుగా మా భూములు ఈటల రాజేందర్ కబంధ హస్తాల్లో ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అసైన్డ్ భూములను తిరిగి మాకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మా దేవుడంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈ భూముల కోసం ఎన్నో పోరాటాలు, ధర్నాలు చేశామన్నారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మా భూములు మాకు ఇప్పించినందుకు సీఎం కేసీఆర్కు బతికినంత కాలం రుణపడి ఉంటామని బాధిత రైతులు తెలిపారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి బాధిత రైతుల వెన్నంటి ఉండి అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలను అందజేశారు. అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82,130 సర్వే నంబర్లలో అక్రమంగా అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూములను తిరిగి బాధిత రైతులకు అప్పగించారు. హకీంపేట గ్రామంలో 97 సర్వే నంబర్లో ఉన్న మూడు ఎకరాల భూమిని తిరిగి రైతులకు అందజేశారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైతుల వెంటే ఉంటూ వారికి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు సీఎం కేసీఆర్ జిందాబాద్.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మాకు న్యాయం జరిగిందని.. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని నినాదాలు చేశారు.
అచ్చంపేట గ్రామంలో 30 ఏండ్ల క్రితం భూములు లేని వారికి, నిరుపేదలకు అసైన్డ్ భూములను ప్రభుత్వం కేటాయించిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆ భూములను ఈటల రాజేందర్ తన భార్య జమునా హేచరీస్ పేరున 85 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. ఆ భూముల్లోకి రైతులను రానివ్వకుండా జమునా హేచరీస్ పేరు మీద పెద్ద పెద్ద షెడ్లు నిర్మించిందన్నారు. రెండు గ్రామాలను అధికారులు పూర్తిస్థాయిలో సర్వేచేసిన అనంతరం నిరుపేదలకు అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాలను అందజేశామన్నారు. బీజేపీ కులాలు,మతాల పేరు మీద చిచ్చు పెడుతున్నదని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. బాధిత రైతులకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారన్నారు. బీజేపీ తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
– కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు న్యాయం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను అమ్మడానికి కానీ, కొనడానికి గానీ వీలు లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల్లో చిచ్చుపెట్టి ఏ విధంగా ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన నిరుపేద రైతులకు అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు అందజేశామని తెలిపారు. ఆ భూముల్లో రైతులు ఏ పంటలు వేసుకున్నా వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు.
– మదన్రెడ్డి,నర్సాపూర్ ఎమ్మెల్యే
ఎన్నో ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇచ్చింది. మా భూములను కోళ్ల కంపెనీ వాళ్లు కబ్జాచేసి రోడ్లు వేశారు. దీంతో మాకు ఉన్న భూమి ఎక్కడ పోతుందోనని భయపడ్డాం. ఎన్నోసార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగాం. ఎవ్వరూ పట్టించుకోలేదు. కలెక్టర్ సారు, ఎమ్మెల్యే సారు దగ్గరకు వెళ్లి మా గోసను చెప్పుకోవడంతో స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిండ్రు. సర్వేలు చేసి మా భూములు మాకు ఇప్పించారు. ఈ భూముల్లో పంటలను సాగు చేసుకుంటాం. మా భూములు మాకు ఇప్పించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం.
– కొయ్యల నర్సమ్మ, రైతు, అచ్చంపేట
మా భూములు మాకు వస్తాయో లేదో అని భయంగా ఉండేది. ఏండ్లపాటు తిరిగాం. సీఎం కేసీఆర్ సారు, ఎమ్మెల్యే సారు మా భూములు మాకు ఇప్పించి చాలా పుణ్యంచేశారు. వారు సల్లగుండాలి. నీళ్ల సౌలతి కల్పిస్తే భూముల్లో పంటలు పండించుకుంటాం. మా భూములు మాకు తిరిగి ఇప్పించినందుకు సంతోషంగా ఉంది.
-భూమగారి శేషమ్మ, రైతు, అచ్చంపేట