సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు.. సకాలంలో రైతుబంధు సాయం అందుతుండడంతో వానకాలం వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. చెరువులు, కుంటల్లోకి చేరుతున్న నీటితో సాగుపై అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పలుచోట్ల రైతులు దుక్కిదున్ని సాగుకు సిద్ధపడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వరినాట్లు వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 6,64,697 ఎకరాలు అంచనా వేస్తుండగా, ఇప్పటి వరకు 5,08,262 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. అత్యధికంగా 3.44 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఇంకా సమయం ఉండడంతో మరో 50వేల ఎకరాలు పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. మెదక్ జిల్లాలో 3,42,200 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంటున్నది. అత్యధికంగా 1,81,000 ఎకరాల్లో వరి పండించనున్నారు. మెదక్, హవేళీఘన్పూర్, నర్సాపూర్, రామాయంపేట, టేక్మాల్, వెల్దుర్తి, మాసాయిపేట తదితర మండలాల్లో ఇప్పటికే నాట్లు మొదలుపెట్టారు. సీజన్ ప్రారంభమవడంతో ట్రాక్టర్లు, కూలీల కొరతతో ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో రైతులు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
సంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ): సకాలంలో కురుస్తున్న వర్షాలు.. అదునుకు రైతుబంధు పెట్టుబడి సాయంతో సంగారెడ్డి జిల్లాలో వానకాలం సాగు జోరందుకున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 5,08,262 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ ఏడాది వానకాలం సీజన్లో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 6,64,697 ఎకరాలు ఉంది. రైతులు ఇప్పటికే 5.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 80 శాతానికి రైతులు వానకాలంలో పంటల సాగు పూర్తి చేశారు. పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటల సాగు చేసేందుకు ఇంకా సమయం ఉం ది. దీంతో పంటల సాగు విస్తీర్ణం 7 లక్షలకు పైగా దాటే అవకాశం ఉంది. జిల్లాలో రైతులు అత్యధికంగా పత్తి పంటను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. 3.22 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అవుతుందని అధికారుల అంచనా. ఇప్పటి వరకు జిల్లాలో 3.44లక్షల మేర రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఇంకా జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో సమృద్ధిగా వర్షాలు
జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురియడంతో రైతులు విత్తనాలు విత్తుకున్నారు. జూన్ నెల 443.3 సెం. మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావా ల్సి ఉంది. అయితే 581.1 సెం.మీటర్ల వర్షం కురిసింది. సాధారణ కంటే 137.8 సెం.మీటర్ల వర్షం అధికంగా కురిసింది. కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్, నారాయణఖేడ్, నాగల్గిద్ద, కోహీర్, మునిపల్లి, పుల్కల్, కొండాపూర్, సంగారెడ్డి, కంది, చౌటకూరు మండలాల్లో సాధారణ కంటే అధికంగా వర్షాలు కురిశాయి. జూలైలో 175.7 సెం. మీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం సంగారెడ్డి జిల్లాలో 30.1 సెం.మీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి పట్టణంలో అత్యధికంగా 5.18 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
5.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగు
రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తుంది. 2021 వానకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలోని 3,02,644 మంది రైతులకు రూ.366.57 కోట్లు అందజేసింది. యాసంగిలో 3,17,552 మందికి రూ. 370 కోట్లు జమ చేసింది. ప్రస్తుతం వానకాలం సీజన్లో 3.74 లక్షల మంది (మూడెకరాలు) ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రైతుబంధు డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో వానకాలం సీజన్లో 5,08,262 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 5,08,262 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. 3,44, 559 ఎకరాల్లో పత్తి, 499 ఎకరాల్లో వరి, 49,494 ఎకరాల్లో కంది, 46,558 ఎకరాల్లో సోయాబీన్, 9934 ఎకరాల్లో మొక్కజొన్న, 1236 ఎకరాల్లో జొన్న పంటలను రైతులు సాగుచేశారు. 8831 ఎకరాల్లో మినుము, 11,765 ఎకరాల్లో పెసర, 12,465 ఎకరాల్లో చెరుకు, 15వేల ఎకరాల్లో రైతులు ఇతర పంటలను సాగుచేశారు. కంది, పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటల సాగుకు ఇంకా సమయం ఉంది. దీంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో 3,42,200 ఎకరాల్లో సాగు
మెదక్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : వరుణుడు కరుణ చూపుతున్నాడు. కురుస్తు న్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడంతో రైతు లు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. మెదక్ జిల్లాలోని పలు చోట్ల నాట్లు వేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లాలో 3,42,200 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. అత్యధికంగా వరి పంట 1,81,000 ఎకరాల వరకు సాగు చేయనున్నారు. మెదక్, హవేళీఘనపూర్, నర్సాపూర్, రామాయంపేట, టేక్మాల్, వెల్దుర్తి, మాసాయిపేట తదితర మండలాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి.
సాగు అంచనా 3.42 లక్షల ఎకరాలు..
మెదక్ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 3,42,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. 1,81 లక్షల ఎకరాల్లో వరి పంట, 94వేల ఎకరాల్లో పత్తి సాగుచేయనున్నట్లు అంచనా వేశారు. మొక్కజొన్న 19వేలు, కంది 21వేల ఎకరాల్లో, జొన్నలు 4వేల ఎకరాలు, మినుములు 6వేల ఎకరాలు, పెసర 8వేల ఎరాలతో పాటు మరో 9వేల ఎకరాలు ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
పెరుగుతున్న సాగు ఖర్చులు..
జిల్లాలో వరి సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పొలాలను దున్నడానికి ట్రాక్టర్లు, నాట్లు వేయడానికి కూలీలకు తీరిక లేకుండా పని లభించనున్నది. జూలై మొదటి వారంలో ఒకేసారి సాగు పనులు ప్రారంభం కావడంతో ట్రాక్టర్ల యజమానులతో, ఇటు కూలీలతో ముందుగానే రైతులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెట్రో, డీజిల్ ధరలు పెరగడంతో గతేడాదితో పోలిస్తే సాగు ఖర్చు పెరగనున్నది. దీంతో రైతులపై భారం ఎక్కువ కానున్నది. గతేడాది పొలం దున్నడానికి ట్రా క్టర్కు గంటకు రూ.1200 ఉండగా, ఇప్పుడు రూ.1400 తీసుకుంటున్నారు. నాట్లు వేసే కూలీలకు గతేడాది రూ.300 కూలీ ఉండగా, ప్రస్తుతం రూ.400 నుంచి 500 వరకు పెరిగింది. దీంతో రైతులు ఇతర జిల్లాలు, పక్క రాష్ర్టాల నుంచి కూలీలను రప్పించుకొని నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
ఎరువుల గురించి ఆందోళన పడొద్దు
మెదక్ జిల్లాలో వరి నాట్లు మొదలయ్యాయి. రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందొద్దు. యూరియాతో పాటు పాస్పెట్ ఎరువులు అన్ని సొసైటీల్లో అందుబాటులో ఉన్నాయి. యూరియాను అవసరం బట్టి తీసుకెళ్లాలి. జిల్లాలో యూరియా 39000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, ఇప్పటి వరకు 9762 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
-పరశురాంనాయక్, వ్యవసాయ శాఖ అధికారి, మెదక్