మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 14: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్థులకు నేటి నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభంకానున్నాయి. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. మూడు దశల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అరగంట ముందు ప్రశ్నాపత్రాలు ఆన్లైన్లో ఉంచేందుకు ఇంటర్ బోర్డు నిర్ణయించింది. వన్టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానంలో గతేడాది నుంచి పరీక్షా కేంద్ర ఎగ్జామినర్ సెల్ఫోన్కు అరగంట ముందు ఆన్లైన్లో ప్రశ్నాపత్రాలు పంపుతున్నారు. మెసేజ్ రాగానే సంబంధిత వెబ్సైట్ నుంచి ప్రశ్నాపత్రాన్ని డౌన్ లోడ్ చేసి ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రశ్నలు ముందుగా తెలిసే అవకాశం ఉండదు. హాల్టికెట్ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ సెట్ ఇవ్వాలనే అంశాన్ని పేపర్ కోడ్ ఆధారంగా వెబ్సైట్లో పేర్కొంటారు. కళాశాలల వారీగా ప్రశ్నాపత్రాల కోడ్లు ఉండటంతో పాటు పరీక్షా సమయానికి అరగంట ముందుగా ఇన్విజిలేటర్ హాల్టికెట్ ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసేలా మార్పులు చేశారు.
రోజుకు రెండు విడతల్లో..
ఈ ప్రాక్టికల్స్ మార్చి 2వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ పరీక్షల అనంతరం వెంటనే వాల్యుయేషన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా జరుగనున్నాయి. పరీక్ష ముగిసిన అనంతరం గంటలోపే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని ఇంటర్ బోర్డు స్పష్టంగా పేర్కొన్నది. వాల్యూయేషన్ చేసిన మార్కుల జాబితాను ఎగ్జామినర్ ఇంటర్ బోర్డుకు ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో అన్ని పరీక్షలు ముగిసే వరకు జవాబు పత్రాలు కళాశాలలోనే భద్రపరిచి ఒకేసారి పంపేవారు. దీంతో అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉండేది.
మెదక్ జిల్లాలో 35 కేంద్రాలు
మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్తో కలిపి 63 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రాక్సికల్స్కు 35 కేంద్రాలు ఎంపిక చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 1206 మంది, వోకేషనల్ విభాగంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 206 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఈనెల 15 నుంచి 20 వ తేదీ వరకు, రెండో విడత 21 నుంచి 25, మూడో విడత 26 నుంచి మార్చి 2 వ తేదీ వరకు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు రెండు ప్లాయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డిలో
సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్తో కలిపి 104 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 88 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 15050 మంది, వొకేషనల్ విభాగంలో 8363 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పారదర్శకంగా నిర్వహిస్తాం
ప్రాక్టికల్స్ను పారదర్శకంగా నిర్వహిస్తాం. ప్రశ్నా పత్రాన్ని పరీక్షకు అరగంట ముందు ఆన్లైన్లో అందిస్తాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నాం. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతి పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్తో పాటు డిపార్ట్మెంటల్ అధికారిని నియమించాం. – సత్యనారాయణ,ఇంటర్ నోడల్ అధికారి,మెదక్