చేర్యాల, జనవరి 27: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్నక్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా రెండో ఆదివారానికి (లష్కర్) సికింద్రాబాద్ భక్తులతో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోనున్నారు. సికింద్రాబాద్ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనుండడంతో రెండో ఆదివారానికి లష్కర్వారంగా పిలుస్తున్నారు. శనివారం సాయంత్రానికి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా మల్లన్న క్షేత్రానికి చేరుకొని మల్లన్నను ధూళిదర్శనం చేసుకున్నారు. లష్కర్ వారం సందర్భంగా భక్తులు మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఒడిబియ్యం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. లష్కర్వారాని వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించామని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని వారు సూచించారు.