చిందు యక్షగానం నుంచి డప్పులు, డోల్లు తయారీలో సమ్మయ్య
హుస్నాబాద్లోనే నాటకాల్లో ఉపయోగించే వాయిద్యాల తయారీ
చిన్నప్పటినుంచి చిందు యక్షగానంతో అందరిని అలరించేవాడు.. రానురాను.. సినిమాలు, టీవీల ప్రభావంతో వీరి నాటకాలను చూసేందుకు జనంలో ఆసక్తి సన్నగిల్లింది.. అయనప్పటికీ నిరాశ చెందలేదు.. బతుకు దెరువు కోసం నాటకాల్లో ఉపయోగించే వాయిద్యాల తయారీని చుకున్నాడు.. కుటుంబానికి ఆసరాగా మార్చుకున్నాడు హుస్నాబాద్కు చెందిన గజ్జెల సమ్మయ్య..
హుస్నాబాద్ టౌన్, మే 23: శ్రీరాముని చరితం తెలిపేదమ్మ… దశరాతజ్మత అయోధ్యపురి.. మందయాననాటిపేరు గాంధారి యందురమ్మ.. యందయాననాటి చిందుపుత్రుడు నీ హృదయము నందు జన్మించినాడమ్మ.. అంటూ గానాన్ని ఆలపిస్తుంటే.. చప్పుట్లు… ప్రశంసలు.. ముఫ్పై కుంచాల వడ్లు ఇస్తే, సంతోషంగా తీసుకొని, మరో ఊరిలో బాగోతం చెప్పేందుకు వెళ్లే వృత్తికి అంకితమైన గజ్జెల సమ్మయ్య కాలానుగుణం ఆ వృత్తి ఆదరణ కోల్పో యినప్పటికీ అధైర్యపడలేదు.. మరో దారిని ఎంచుకున్నాడు జీవనాధారం సంపాదించాడు..
తాతలు.. తండ్రుల కళను నమ్ముకొని..
తాతలు.. తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆ కళను చిన్ననాటి నుంచి నమ్ముకుని జీవనం సాగించిన సమ్మయ్య కుటుంబం. కాలానుగుణంగా మారిన పరిస్థితులు కళకు ఆదరణ లభించకపోవడంతో వాయిద్యాల వృత్తినే నమ్ముకుని చిన్ననాటి నుంచి తల్లి దండ్రుల వృత్తైన చిందుయక్షగానాన్ని నేర్చుకున్నాడు. ప్రతీ ఊరిలో నాలుగు బాగోతాలు.. జాంబ పురాణం, ఎల్లమ్మ వేషం కట్టి, గొర్రెపిల్లను గావు పట్టేది.. పైగా అందరని ఆకట్టుకునే మహిళా వేషంతో
రక్తికట్టించేది ఈ సమ్మయ్య.
టీవీలు, సినిమాలు వచ్చినంక మా దుకాణం బందైంది..
సినిమాలు, టీవీలు వచ్చినంక చిందు యక్షగానం దుకాణం బందైంది. మా ఊరిలో బాగోతం చెప్పుండ్రి.. అని వాళ్లే లేరు. టీవీలల్ల సీరియల్స్ను మహిళలు ఇష్టపడుతుండ్రు. మమ్మల్ని సూసేటోల్లులేరు. గందుకనే డప్పులు, డోలుగిట్ల నేను నా భార్య కృష్ణవేని కలిసి చేస్తున్నం. మస్తు ఊర్లల్ల నుంచి వచ్చి ఇవి కొంటుండ్రు. వీటితోనే మేం మంచిగ బతుకుతున్నం.
– గజ్జెల సమ్మయ్య, హుస్నాబాద్
ఇరువై రెండేండ్ల నుంచి..
కాలం మారింది.. సినిమాల ప్రభావం.. టీవీ సీరియల్స్ చిందుయక్షగానాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో సమ్మయ్య సైతం ఆదరణలేని చిందు యక్షగానాన్ని తక్కువ చేసి కుటుంబాన్ని పోషించుకునేందుకు నాటకరంగానికి ఉపయోగిస్తున్న వాయిద్యాలను తయారు చేయాలని భావించాడు. 22ఏండ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి పలు రకాల వాయిద్యాల తయారీలో శిక్షణ పొందాడు.
డోలు.. డోలక్.. డప్పుల తయారీ
టీవీలు, సినిమాల ప్రభావంతో తమ నాటకాలు ఆదరణ కోల్పోవడంతో వాయిద్యాలను తయారీని ప్రారంభించాడు. 22ఏండ్లుగా తబల, డోలు, డప్పులు, బ్యాండ్లు, జగ్గు, కాంగో, కాలిగజ్జెలు తయారు చేస్తున్నాడు. వీటికి అవసరమైన తోలు తదితర సామగ్రినంతా హైదరాబాద్ నుంచి తెచ్చి తయారీ చేస్తున్నాడు. భజనలతో పాటు రాజకీయ పార్టీల కార్యక్రమాలకు వాయిద్యాలను ఉపయోగించేవారు అధికం కావడంతో సమ్మయ్య చేపట్టిన వృత్తికి మంచి ఆదరణ లభిస్తున్నది.