గజ్వేల్, ఏప్రిల్ 1: రీజినల్ రింగ్రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం చేపట్టే భూసేకరణలో రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారికి అండగా ఆర్టీవో కార్యాలయం ఎదుట నిరహార దీక్ష చేపడుతామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ బాధిత రైతులకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని, పరిహారం విషయంలో న్యాయమైన ప్రకటన వచ్చే వరకు ఎవరూ సంతకాలు చేయవద్దన్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.కోటి ఉందని, అందుకు ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.30లక్షల పరిహారంతోపాటు 250 గజాల ఇంటి ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకరవర్గంలోని 17 రెవెన్యూ గ్రామాల రైతులకు గజ్వేల్ పట్టణంలోనే భూసేకరణ చేసి 250 గజాల ఇంటి ప్లాట్ను ఇవ్వాలన్నారు.
భూసేకరణ సమయంలో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయకుండా వారిని ఒప్పించి భూములు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణాల కోసం భూసేకరణ చేపడితే రైతులకు న్యాయం చేయాలని పోరాడానన్నారు. బీఆర్ఎస్ తరఫున ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తామని, తగిన పరిహారం వచ్చేవరకు అండగా ఉంటామన్నారు. పోలీసుల పహారాలో భూసేకరణ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారంతోపాటు ఇండ్లు, ప్యాకేజీలు, ఓపెన్ ప్లాట్లు ఇచ్చిందన్నారు. అదే తరహాలో రైతులకు మార్కెట్ ధరకు అనుగుణంగా ఎకరాకు పరిహారం ఇవ్వాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, కౌన్సిలర్లు మెట్టయ్య, చందు, శ్రీనివాస్, నాయకులు విరాసత్ అలీ, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, స్వామిచారి, అహ్మద్ ఉన్నారు.
గజ్వేల్ పట్టణంలోని శోభ గార్డెన్లో మంగళవారం ఉదయం 10గంటలకు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఉంటుందని, ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని వంటేరు ప్రతాప్రెడ్డి కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగే సమావేశానికి మాజీమంత్రి హరీశ్రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలతోపాటు ముఖ్యులు హాజరవుతారని తెలిపారు. ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు.